యూపీ ఎన్నికల వేళ బీజేపీకి తలనొప్పులు-రంగంలోకి ప్రధాని దూత-యోగీ కేబినెట్లో మార్పులు
వచ్చే ఏడాది ఆరంభంలో దేశంలోనే అతిపెద్దదైన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే సరిగ్గా ఎన్నికల వేళ యోగీ ఆదిత్యనాథ్ సర్కారుకు తలనొప్పులు మొదలయ్యాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనాను ఎదుర్కోవడంలో యోగీ సర్కారు వైఫల్యంతో పాటు ఇతర సమస్యలూ బీజేపీని వెంటాడుతున్నాయి. దీంతో యూపీలో పరిస్ధితి చక్కదిద్దేందుకు ప్రధాని మోడీ దూతగా మాజీ బ్యూరోక్రాట్ ఏకే శర్మను రంగంలోకి దించుతున్నారు.
యూపీలో గడ్డు పరిస్ధితులు ఎదుర్కొంటున్న బీజేపీని గట్టెక్కించే వ్యూహంపై రెండు రోజుల పాటు లక్నోలో జరిగిన బీజేపీ అగ్రనేతల భేటీ తర్వాత యోగీ ఆదిత్యనాథ్ను సీఎంగా, స్వతంత్రదేవ్ సింగ్ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించాలని నిర్ణయించారు. అయితే యోగీ కేబినెట్లో మార్పులు చేయాలని కూడా నిర్ణయించారు. ఇందులో కులాలు, ప్రాంతాల వారీగా మరికొందరు నేతలకు కేబినెట్ విస్తరణలో చోటు కల్పించాలని అగ్రనేతలు ఓ అంచనాకు వచ్చారు.

తాజాగా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయాలు మూటగట్టుకున్న నేపథ్యంలో యూపీలో పార్టీ పరిస్ధితిపై ఆగ్ర నేతల్లో ఆందోళన పెరుగుతోంది. అయితే కింది స్ధాయి నేతల్లో పట్టున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్ను కొనసాగించడమే మంచిదని అగ్రనేతలు భావిస్తున్నారు. తాజా భేటీలో ఆరెస్సెస్ నేతలు సైతం యూపీలో ఎన్నికలకు ముందే యోగీ సర్కార్పై విమర్శల దాడి పెరుగుతుండటాన్ని సీరియస్గా తీసుకోవాలని బీజేపీకి సూచించారు. అలాగే ప్రభుత్వానికీ, పార్టీకి మధ్య పెరుగుతున్న గ్యాప్ను తగ్గించాలని కూడా ఆరెస్సెస్ నేతలు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications