మమత బాటలో అఖిలేష్-యూపీ పోరుకు "ఖదేదా హోయిబే" నినాదంతో సాంగ్ రిలీజ్
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీల వ్యూహాలు పదునెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార బీజేపీని మరోసారి గద్దెనీయకుండా అఢ్డుకునేందుకు విపక్షాలు సర్వశక్తులొడ్డుతున్నాయి. ఇదే క్రమంలో విపక్ష సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. తాజాగా బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ప్రారంభించిన ఖేలా హోబే (ఆట మొదలైంది) ప్రచారం తరహాలోనే ఖడేరా హోబే అంటూ మరో కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు.
ఉత్తర్ ప్రదేశ్ పోరులో బీజేపీకి వ్యతిరేకంగా తన పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచేందుకు సమాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖడేరా హోబే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందుకోసం తయారు చేసిన పాటను తాజాగా ఆయన విడుదల చేశారు. ఈ పాట ఇప్పుడు ఎస్పీతో పాటు ఇతర పార్టీల కార్యకర్తల్ని సైతం బీజేపీకి వ్యతిరేకంగా ఉత్సాహపరుస్తోంది. దీంతో పాటు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది.

బెంగాల్లో ఖేలా హోబే ప్రచారం ప్రారంభించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ చేశారు. అంతే కాదు బీజేపీని వంద సీట్లకు లోపే పరిమితం చేసేశారు. ఆ ఎన్నికల్లో ఖేలా హోబే ప్రచారంతో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. ఎక్కడ చూసినా ఈ పాటే కనిపించింది., వినిపించింది. దీంతో బీజేపీకి చిర్రెత్తుకొచ్చింది. చివరికి బీజేపీ ఓటమిపాలైంది. ఇప్పుడు అదే కోవలో యూపీలోనూ అదే తరహా ప్రచారంతో బీజేపీకి వ్యతిరేకంగా తమ కార్యకర్తలను సన్నద్ధం చేయడానికి అఖిలేష్ యాదవ్ ఖడేరా హోబే ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరి బెంగాల్లో విజయవంతమైన ఈ ప్రచారం యోగీ సర్కార్ పై ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. ఈసారి కాంగ్రెస్, బీఎస్పీతో పోలిస్తే బీజేపీపై ప్రచారంలో ముందున్న ఎస్పీ ఈ తాజా ప్రచారంతో మరింత దూసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications