జయలలిత విడుదల కోరుతూ రక్తసంతకాలు
చెన్నై: తమ పార్టీ అధినేత జయలలిత విడుదల కోసం అన్నాడియంకె కార్యకర్తలు గాంధేయ మార్గంలో ఆందోళనను ఉధృతం చేశారు. జయలలితను విడుదల చేయాలని కోరుతూ అన్నాడియంకె వినతిపత్రం తయారు చేసి దానిపై రక్తసంతకాలు చేసే ఉద్యమానికి వారు శుక్రవారం శ్రీకారం చుట్టారు.
రక్తసంతకాలతో కూడిన వినతిపత్రాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, గవర్నర్ కె. రోశయ్యకు సమర్పించనున్నారు. తమ అమ్మను దోషిగా అన్యాయంగా నిర్ధారించి జైలులో పెట్టారని, ఆమె విడుదలయ్యే వరకు తాము శాంతియుత పద్ధతుల్లో ఆందోళన సాగిస్తామనని టి నగర్ శాసనసభ్యుడు విపి కలైరాజన్ చెప్పారు.

రక్త సంతకాల ఉద్యమం పేరు మీద ఆయన దీన్ని ప్రారంభించారు. కార్యకర్తల నుంచి రక్తం తీయడానికి డాక్టర్లు, నర్సుల సహాయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తన నుంచి పది మిల్లీలీటర్ల రక్తం తీసినట్లు ఆయన తెలిపారు. జయలలిత కేసు బెంగళూర్ హైకోర్టులో ఈ నెల 7వ తేదీన విచారణకు రానుంది. ఈ సందర్భంగా రక్త సంతకాలతో కూడిన వినతిపత్రాలను రాష్ట్రపతికి, గవర్నర్కు సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.
ఇప్పటి వరకు 2500 మంది వినతిపత్రంపై రక్త సంతకాలు చేసినట్లు ఆయన తెలిపారు. వేలాది మంది సంతకాలను తాము సేకరిస్తామని ఆయన చెప్పారు. ఈ ప్రచారానికి సుభాష్ చంద్రబోస్ తమకు స్ఫూర్తి అని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications