అభిమానులకు శుభవార్త: పార్టీ 45వ వార్షికోత్సవం, జయలలిత అంగీకారం
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఆమె పత్రికలు చదువుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే కార్యకర్తలు, జయ అభిమానులకు మరో శుభవార్త. ఆమె అంగీకారంతో పార్టీ 45వ వార్షికోత్సవం కూడా నిర్వహించనున్నారు.
గత నెల 22వ తేదీ నుంచి జయ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లుగా వస్తున్న వార్తల పైన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జయలలిత అంగీకారంతో ఈ నెల 17వ తేదీన పార్టీ 45వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అన్నాడీఎంకే నిర్ణయించింది.
పార్టీ 44 నుంచి 45వ ఏటకు అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు ఎంజీ రామచందన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నట్లు శుక్రవారం నాడు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకటన విడుదలకు జయలలిత అంగీకరించినట్లు అన్నాడీఎంకే తెలిపింది.
కాగా, జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి డీఎంకే అధినేత కరుణానిధి సతీమణి రాజతి అమ్మాల్ చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వెళ్లిన విషయం తెలిసిందే. అమ్మాల్ గురువారం రాత్రి అపోలోలో జయలలిత స్నేహితురాలు శశికళ నటరాజన్ను కలిసి జయ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారని డీఎంకే వర్గాలు వెల్లడించాయి.