మీరు వద్దు, మీ పదవి వద్దు, రాజకీయాలే వద్దు: పన్నీర్ సెల్వం
తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం తీవ్రమనస్థాపంతో ఉన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు పన్నీర్ సెల్వం సన్నిహితులతో తెలిపారని సమాచారం.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం తీవ్రమనస్థాపంతో ఉన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు పన్నీర్ సెల్వం సన్నిహితులతో తెలిపారని సమాచారం. శశికళ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వంలో తాను ఏ పదవిలో ఉండనని పన్నీర్ సెల్వం చెప్పారని తెలిసింది.
శశికళ ఏ పదవి ఇచ్చినా తీసుకునే ప్రసక్తేలేదని పన్నీర్ సెల్వం కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. అయితే మంగళవారం ప్రమాణస్వీకారం చెయ్యడానికి ఏర్పాట్లు చేసుకున్న శశికళ తరువాత గవర్నర్ ఝలక్ ఇవ్వడంతో షాక్ కు గురైనారు.
ఈనెల 9వ తేది గురువారం శశికళ ప్రమాణస్వీకారం చేస్తారని ఆమె సన్నిహితులు అంటున్నారు. గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు చెన్నై రాగానే కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన తరువాత పోటీ చెయ్యడానికి నియోజక వర్గాలను ఆన్వేషించే పనిలో శశికళ ఉన్నారు.
అయితే జయలలిత ప్రానిథ్యం వహించిన చెన్నైలోని ఆర్ కే నగర్ లో శశికళ మీద తీవ్రవ్యతిరేకత ఉంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఓడిస్తామని ఇప్పటికే ఆర్ కే నగర్ ప్రజలు శశికళను తీవ్రస్థాయిలో హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఇక పన్నీర్ సెల్వం నియోజక వర్గంలో శశికళకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. సీఎం పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చెయ్యడంతో గవర్నర్ ఆమోదిస్తూ పత్ర్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు కొనసాగాల్సిందిగా గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ విద్యాసాగర్ రావు ఢిల్లీ నుంచి చెన్నై రాకుండా ముంబై వెళ్లి అక్కడే మకాం వేశారు.