శశికళ ఎఫెక్ట్-చెన్నైకి గవర్నర్.. అందరికీ 'నో' చెప్పారు: 'మీ ఆటలు సాగవు'
తమిళనాడులో రాజకీయ సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రోజు అన్నాడీఎంకే చీఫ్ శశికళ ఢిల్లీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గవర్నర్ విద్యాసాగర రావును కలిసేందుకు వెళ్లే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి.
చెన్నై: తమిళనాడులో రాజకీయ సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రోజు అన్నాడీఎంకే చీఫ్ శశికళ ఢిల్లీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గవర్నర్ విద్యాసాగర రావును కలిసేందుకు వెళ్లే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి.
అనూహ్యంగా ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు రేపు (గురువారం) మధ్యాహ్నం చెన్నైకి రానున్నారు. అయితే, ఆయన ఏ రాజకీయ పార్టీ నాయకులకు అపాయింటుమెంట్ ఇవ్వకపోవడం గమనార్హం. ఇది కూడా చర్చనీయాంశమైంది.
సీఎస్, డీజీపీ, చెన్నై సీపీ, ఇంటెలిజెన్స్ ఐజీలతో ఆయన సమావేశం కానున్నారు. తమిళనాడులో లా అండ్ ఆర్డర్ పైన ఆయన వారితో సమీక్షించనున్నారు. సమీక్ష అనంతరం ఆయన రాజకీయ పరిణామాల పైన దృష్టి సారించనున్నారని తెలుస్తోంది.
శశికళకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున ఆమెచే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారా? లేక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం బలం నిరూపించుకుంటారా? అనే చర్చ సాగుతోంది.
అన్నాడీఎంకే శాసన సభా పక్ష నాయకురాలిగా శశికళను ఎన్నుకొని నాలుగు రోజులు అవుతోంది. అయినప్పటికీ ఇప్పటి దాకా శశికళ వర్గానికి అపాయింటుమెంట్ ఇవ్వలేదు. దీనిపై ఆయన ఏం చేస్తారనే చర్చ సాగుతోంది. అలాగే, పన్నీరు సెల్వం వర్గానికి కూడా అపాయింటుమెంట్ ఇవ్వలేదు.
శశికళ ఎఫెక్ట్
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు క్లిష్టంగా ఉన్న పరిస్థితుల్లోను ఇంచార్జి గవర్నర్ లేకపోవడంపై శశికళ వర్గీయులు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయన చెన్నై రానున్నారని అంటున్నారు. రాష్ట్రంలో పెను రాజకీయ సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ ఎక్కడ అని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ప్రశ్నించడం గమనార్హం.
ఈ రోజు ఉదయం తొలుత పన్నీరు సెల్వం.. శశికళకు వ్యతిరేకంగా గళం విప్పారు. తన రాజీనామాను ఉపసంహరించుకుంటానని, బలవంతంగా తనతో రాజీనామా చేయించారని శశికళ పైన ధ్వజమెత్తారు. శశికళ కూడా ధీటుగా స్పందించారు. నేను కూడా సిద్దమని, పన్నీరుకు జయలలిత, తాను అవకాశమిచ్చి చూశామని, ఆయన తప్పు చేశారని, ఇక ఆయన ఆటలు సాగవని హెచ్చరించారు.
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ నిప్పులు చెరిగారు. డీఎంకేతో చేతులు కలిపిన పన్నీరు పార్టీని అధికారంలోకి దించేయాలని కుట్రపన్నారని పేర్కొన్నారు. 33 ఏళ్లుగా అమ్మతో ఉన్న తాను ఇలాంటి ద్రోహాలను చాలా ఎదుర్కొన్నానని మద్దతుదారులకు తెలిపారు.
జయ నాకు దేవత
అమ్మ జయలలిత తనకు దేవత అని, ఆమెతో 33 ఏళ్ల ప్రయాణంలో ఎత్తుపల్లాలు, సంక్షోభాలు చూశఆనని, వాటన్నింటినీ ఎదుర్కొన్నానని, దీన్ని ఎదుర్కొంటానని అమ్మ పేరుపై ప్రమాణం చేయగలనని చెప్పారు.
నేను సీఎం కాకుండా..
అన్నాడీఎంకేకు ఒకరి తర్వాత ఒకరు శత్రువులు పుట్టుకొస్తున్నారని, వారంతా ఓడిపోక తప్పదని ఆవేశపూరితంగా శశికళ హెచ్చరించారు. కుట్రలను ఎంత మాత్రం సహించనని ఉద్ఘాటించారు. ఇది డీఎంకే మోసపూరిత పథకమని తనను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్న ఎంకే స్టాలిన్ను ఉద్దేశించి అన్నారు.
నిలదీత
గత రెండు నెలలుగా పన్నీర్ సెల్వం ప్రతిపక్షాలతో కలిసి పని చేస్తున్నాడని అయితే తాను దాన్ని పట్టించుకోలేదని శశికళ అన్నారు. ఇన్నిరోజులు ఆయనెందుకు నిశబ్దంగా ఉన్నారు? ఆయన వెనకాల డీఎంకే మద్దతు ఉందా ప్రశ్నించారు. తమను ఓడించేందుకు శత్రువులంతా ఏకమయ్యారని.. అందుకే గత కొన్ని రోజులుగా ఇలాంటి పరిణామాలు చూస్తున్నామన్నారు.
ఒత్తిడి చేశానంటే నమ్మరు
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని తాను ఒత్తిడి చేశానంటే ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఎవరూ నమ్మరని శశికళ అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని, ఐతే పన్నీర్ సెల్వం మంగళవారం లక్ష్మణరేఖను దాటేశారని పేర్కొన్నారు. పార్టీను చీల్చాలనుకొంటున్న వారి ఆటలు సాగవని హెచ్చరించారు.
ద్రోహం చేయలేదని పన్నీరు సెల్వం
ఉదయం పన్నీరు సెల్వం మాట్లాడుతూ.. తానెప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదని, పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని, మాట్లాడబోమని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ పార్టీకి విధేయుడిగానే ఉన్నానన్నారు. తనను బీజేపీ, డీఎంకే వెనకుండి నడిపిస్తోందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.
ఎంతో సేవ చేశారు
ఎంజీఆర్, జయలలిత తమిళనాడుకు ఎంతో సేవ చేశారని, వారి బాటలోనే తానూ నడుస్తానని పన్నీరు సెల్వం అన్నారు. శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి మాత్రమేనని, త్వరలోనే ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటామని తెలిపారు. తనను పార్టీ నుంచి తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు.
శశికళతో వీరే..
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ దాదాపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరి మద్దతు కూడగట్టుకున్నారు. పార్టీ 134 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 131 మంది ఆమెతో ఉన్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన పన్నీర్సెల్వం తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. పన్నీరు వెంట కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని సమాచారం.
రహస్య ప్రాంతాలకు
ఈ నేపథ్యంలో తన వైపు ఎమ్మెల్యేలను ఇతరులెవరూ ప్రలోభ పెట్టే వీలు లేకుండా శశికళ వారిని రహస్య ప్రాంతానికి తరలించారు. ఎమ్మెల్యేలను బస్సుల్లో హోటల్కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
గవర్నర్ కారణంగా..
శశికళ తన బలాన్ని చూపించుకునేందుకు అన్నాడీఎంకే ఎంపీలతో కలిసి ఈ రోజు రాత్రికి ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. గవర్నర్ తీరు కారణంగా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లైందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతలోనే గవర్నర్ రేపు వస్తారని తెలిసింది.