మోదీకి బానిసలా అన్నాడీఎంకె... డీఎంకె సెక్యులరిజం నిర్వచనమేంటో? నిప్పులు చెరిగిన ఓవైసీ..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ... అందుకు తగిన గ్రౌండ్ను ప్రిపేర్ చేస్తున్నారు. తమిళ అస్తిత్వ ప్రతీకలుగా ముద్రపడ్డ ప్రధాన ద్రవిడ పార్టీలపై పదునైన విమర్శలు చేస్తున్నారు. డీఎంకె,అన్నాడీఎంకె... ఈ రెండు పార్టీలు తమ సిద్దాంతాలను పక్కనపెట్టి కేవలం రాజకీయ ప్రాభవం కోసం పాకులాడుతున్నాయని తాజాగా విమర్శించారు. అన్నాడీఎంకె ప్రధాని నరేంద్ర మోదీకి 'బానిస'గా మారిందని విమర్శించారు. తమను పొత్తుకు దూరం పెట్టిన డీఎంకె పార్టీ సెక్యులరిజంకు నిర్వచనం చెప్పగలదా? అని ప్రశ్నించారు. శుక్రవారం(మార్చి 12) దినకరన్తో కలిసి పాల్గొన్న పొలిటికల్ ర్యాలీలో అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించారు.
డీఎంకె,అన్నాడీఎంకెలపై అసద్ ఎటాక్...
'ఇప్పుడున్న అన్నాడీఎంకె ఇక ఏమాత్రం జయయలిత పార్టీ కాదు. ఆమె బతికి ఉన్నప్పుడు బీజేపీని ఎప్పుడూ దూరం పెట్టారు. కానీ ఇప్పుడు అదే అన్నాడీఎంకె నరేంద్ర మోదీకి బానిసగా మారింది.' అని అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న డీఎంకె సెక్యులరిజం విలువలపై అసదుద్దీన్ పలు ప్రశ్నలు సంధించారు. 'బాబ్రీ మసీదు కూల్చివేతకు శివసేన గొప్ప త్యాగం చేసిందని... అందుకు గర్వంగా ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్దవ్ థాక్రే అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. శివసేన చేసిన ఆ వ్యాఖ్యలను డీఎంకె సమర్థిస్తుందా...? నన్ను,దినకరన్ను బీజేపీ బీ టీమ్ అని ఆరోపిస్తున్నారు. కానీ శివసేన అధికారంలోకి రావడానికి సహకరించిన కాంగ్రెస్తో డీఎంకె జతకట్టవచ్చు. మేము ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీ లాభపడుతుందని వాదిస్తున్నారు.సెక్యులరిజం అన్న పదానికి తమ నిర్వచనమేంటో డీఎంకె చెప్పగలదా... మహారాష్ట్రలో కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న శివసేన సెక్యులరా..? కమ్యూనలా...?' అని అసదుద్దీన్ ప్రశ్నించారు.
బీజేపీనే విమర్శిస్తూనే డ్రకోనియన్ చట్టాలకు మద్దతా?
ఓవైపు బీజేపీని విమర్శిస్తూనే మరోవైపు ఆ పార్టీ చేసిన చట్టాలకు కాంగ్రెస్ మద్దతు తెలుపుతోందని అసదుద్దీన్ విమర్శించారు. అసాంఘీక కార్యకలాపాల నిరోధక చట్టం(UAPA)కు కేంద్రం చేసిన సవరణలకు కాంగ్రెస్ మద్దతునివ్వలేదా అని ప్రశ్నించారు. అటు డీఎంకె కూడా తాము సెక్యులరిస్టులమని చెబుతూనే... కేంద్రం చేస్తున్న డ్రకోనియన్ చట్టాలకు మద్దతునిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేవలం అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం మాత్రమే మైనారిటీలు,పేదల ప్రయోజనాలు,హక్కులను కాపాడగలదని అన్నారు. డీఎంకెతో పొత్తు కుదరకపోవడంతో టీటీవీ దినకరన్ నేత్రుత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగంతో కలిసి ఎంఐఎం బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.
రసవత్తరంగా తమిళ రాజకీయం
దివంగత దిగ్గజ నేతలు కరుణానిధి,జయలలిత లేకుండా తమిళనాడులో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అన్నాడీఎంకె పార్టీ ఒకానొక దశలో నిట్ట నిలువునా చీలిపోతుందని చాలామంది భావించారు. కానీ ఎలాగోలా ఐదేళ్ల పాలనను ఆ పార్టీ నెట్టుకొచ్చింది. అయితే ఇప్పుడు జయలలిత లేకుండా ఎన్నికల్లో ఆ పార్టీ ఎంతమేర రాణించగలదన్నది చూడాలి. మరోవైపు పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న డీఎంకె ఈసారి తమదే అధికారమన్న ధీమాతో ఉంది. ఇప్పటికే పలు సర్వేలు కూడా తమిళ గడ్డపై ఈసారి డీఎంకె గెలబోతుందని చెప్పాయి. ఈసారి ఎన్నికల్లో డీఎంకె-కాంగ్రెస్,అన్నాడీఎంకె-బీజేపీ,ఎంఐఎం-ఏఎంఎంకె కూటమలుగా బరిలో దిగుతున్నాయి. అటు కమల్ హాసన్ నేత్రుత్వంలోని మక్కల్ నీది మయ్యమ్ పార్టీ కూడా ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి,ఇందియ కట్చి పార్టీలతో పొత్తుతో బరిలో దిగుతోంది. ఇన్ని కూటముల నడుమ తమిళ రాజకీయం ఈసారి రసవత్తరంగా మారింది.