శశికళ ఆస్తులపై విచారణ చేయిస్తాం, నిజాలు బయటకు వస్తాయి, రూ. కోట్ల ఆస్తులు ఎలా?
బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళకు మరో ఝలక్ ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సిద్దం అయ్యారని తెలిసింది. శశికళ అక్రమ ఆస్తులు గుర్తించి వాటిని ప్రభుత్వానికి అప్పగించడానికి రంగం సిద్దం చేస్తున్నారు.
అన్నాడీఎంకే పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ చెనైలో మీడియాతో మాట్లాడుతూ శశికళ అక్రమాస్తులు గుర్తించడానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని అన్నారు. 1983లో శశికళ చెన్నై చేరుకుని అద్దె ఇంటిలో నివాసం ఉండేవారని మధుసూదనన్ గుర్తు చేశారు.
ఇప్పుడు శశికళ, ఆమె భర్త నటరాజన్ కు కోట్ల రూపాయల విలువైన అస్తులు ఉన్నాయని, ఇది ఎలా సాధ్యం అయ్యిందని మధుసూదనన్ ప్రశ్నించారు. శశికళ అక్రమాస్తులపై దర్యాప్తు చేయిస్తే ఎన్నో రహస్యాలు బయటకు వస్తాయని, ఆదిశగా చర్యలు తీసుకుంటామని మధుసూదనన్ చెప్పారు. పార్టీ, ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని శశికళ కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా అక్రమాస్తులు సంపాధించారని ఆయన ఆరోపించారు.

టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే పార్టీ సభ్యుడే కాదని మధుసూదనన్ అన్నారు. జయలలిత 12 ఏళ్ల క్రితమే టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి శాశ్వతంగా తప్పించారని గుర్తు చేశారు. ఇప్పుడు టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలలో చీలిక తీసుకు వచ్చి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
సూపర్ స్టార్ రజనీకాంత్, బహుబాష నటుడు కమల్ హాసన్ రాజకీయ రంగ్రప్రవేశంపై మధుసూదనన్ స్పందిస్తూ. ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా ప్రజల సమస్యలు తీర్చడానికి పని చెయ్యాలని అన్నారు. అవసరం అయితే ప్రజల కోసం పోరాటాలు చేసి జైలుకు వెళ్లడానికి సిద్దం కావాలని, అందుకు వారు (రజనీకాంత్, కమల్ హాసన్) సిద్దంగా ఉన్నారా అంటూ మధుసూదనన్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications