రెండాకుల గుర్తు: ఎన్నికల కమిషన్ ముందు వాదనలు, అన్నాడీఎంకే పార్టీ ఎవరికి, నేడే తీర్పు !
రెండాకుల చిహ్నం కోసం రెండు వర్గాలు పోటీనేడు ఎన్నికల కమిషన్ ముందు హాజరైన రెండు వర్గాల నాయకులుమెజారిటీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరివైపు ఉన్నారో వారికే అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం ?
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం ఎవ్వరికి ఇవ్వాలనే విషయంలో సోమవారం (అక్టోబర్ 23వ తేది) భారత ఎన్నికల కమిషన్ ఓ నిర్ణయం తీసుకోవాలని సిద్దం అయ్యింది. అన్నాడీఎంకే పార్టీలోని రెండు వర్గాలు సోమవారం భారత ఎన్నికల కమిషన్ అధికారుల ముందు హాజరై వారి వాదనలు వినిపిస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలోని మంత్రులు డి. జయకుమార్, సీవీ షణ్ముగం, రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్, తమిళనాడు మాజీ మంత్రి కేపీ. మునిస్వామి ఎన్నికల కమీషన్ ముందు హాజరై రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలని మనవి చేశారు.
వీకే. శశికళ, టీటీవీ దినకరన్ వర్గం నుంచి మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఎమ్మెల్యేలు పళనియప్పన్, రతినసభాపతి ఎన్నికల కమిషన్ ముందు హాజరై రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలని మనవి చేశారు. శశికళ వర్గంలోని అన్నాడీఎంకే పార్టీ కర్ణాటక శాఖ ప్రధాన కార్యదర్శి పూహళేంది రెండాకుల చిహ్నం మాకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అన్నాడీఎంకే పార్టీకి చెందిన మెజారిటీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎవరివైపు ఎక్కువ మంది ఉంటే వారికే రెండాకుల చిహ్నం కేటాయించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించిందని సమాచారం. రెండాకుల చిహ్నం ఎవరికి వస్తుందో అంటూ ఆ పార్టీ కార్యకర్తలు టెన్షన్ టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.