'మాకు ప్రతి ఒక్కటీ 'అమ్మ' జయలలితనే': (వీడియో)
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 68వ పుట్టిన రోజు వేడుకలను గురువారం నాడు ఆ పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తమ చేతుల పైన జయలలిత ఫోటోలను టట్టూలుగా వేయించుకున్నారు.
'మాకు ప్రతి ఒక్కటీ అమ్మనే' (అమ్మా ఎవ్రీతింగ్ ఫర్ అస్) అని తమ చేతుల పైన టట్టూలు వేయించుకున్నారు. జయలలితను అభిమానులు 'అమ్మ' అని అప్యాయంగా పిలుచుకునే పార్టీ నిర్వాహకులు, కార్యకర్తలు మంగళవారం అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు కేక్ కోసి సంబరాలు జరుపుకొన్నారు.
చెన్నైలోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రమంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అధినేత్రి జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. జయలలితకు 68వ పుట్టినరోజు వేడుకలు కావడంతో 68 కిలోల భారీ కేకును కోశారు.
జయలలిత
జయలలిత పుట్టిన రోజు సందర్భంగా వేలూరు జిల్లా ఆర్కాడు బస్టాండులో 1500 కిలోల భారీ కేకును కోసి సంబరాలు చేసుకున్నారు.
జయలలిత
చెన్నై వేళచ్చేరిలో మంగళవారం వందలాది మంది 'అమ్మ' రూపాన్ని తమ చేతులపై పచ్చబొట్లుగా పొడిపించుకోగా వేలూరు జిల్లా అగరంజేరిలో కేవలం పచ్చబొట్లు పొడిచేందుకే 38 మంది షికారీలను అన్నాడీఎంకే కార్యకర్తలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
జయలలిత
ఒక్కొక్కరికి పచ్చబొట్టు పొడిచినందుకు రూ.300 చొప్పున చెల్లించారు. రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు.
జయలలిత
అన్న, వస్త్ర దానాలు సరేసరి. చెన్నై సహా పలు జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 23వ తేదీ అర్ధరాత్రి తర్వాత పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరాలను ఆ పార్టీ స్థానిక నేతలు కానుకగా అందించారు.