పన్నీర్ వర్గంలోకి 12 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు జంప్: సీఎంకు చాక్లెట్ !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వర్గంలోని 12 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు మా వర్గంలో చేరడానికి సిద్దంగా ఉన్నారని, ఆ రోజు పళనిసామి ప్రభుత్వం కుప్పకూలిపోతుందని పన్నీర్ సెల్వం వర్గంలోని
సేలం/చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వర్గంలోని 12 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు మా వర్గంలో చేరడానికి సిద్దంగా ఉన్నారని, ఆ రోజు పళనిసామి ప్రభుత్వం కుప్పకూలిపోతుందని, సీఎంకు చాక్లెట్ గ్యారెంటీ అంటూ పన్నీర్ సెల్వం వర్గంలోని మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే సెమ్మలై బాంబు పేల్చారు.
ఇప్పటికే ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు మాతో సంప్రందించారని, బేషరుతుగా మా వర్గంలోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నామని సేలంలో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో ఎమ్మెల్యే సెమ్మలై చెప్పడంతో ఎడప్పాడి పళనిసామి వర్గం ఉలిక్కిపడింది.

పన్నీర్ సెల్వం మాటతో
తమిళనాడు రాష్ట్ర పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాట్లాడుతూ స్థానిక సమరానికి ముందే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు తథ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమరానికి తాము సిద్దంగా ఉన్నామని పన్నీర్ సెల్వం అన్నారు.

మరో నాయకుడు జోస్యం
పన్నీర్ సెల్వం వర్గంలోని అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కేపీ మునిసామి మీడియాతో మాట్లాడుతూ రెండు వర్గాల విలీనం చర్చలకు ఇద్దరు మంత్రులు అడ్డుపడుతున్నారని విమర్శించారు. అంతటితో ఆగకుండా ఆ ఇద్దరు మంత్రులు జయకుమార్, దిండుగల్ శ్రీనివాస్ అని బహిరంగంగా చెప్పడంతో పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది.

పన్నీర్ సెల్వం సీఎం కావాలనే
ఎడప్పాడి పళనిసామి వర్గంలోని 12 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తామని ముందుకు వచ్చారని మాజీ మంత్రి, పన్నీర్ వర్గంలోని సీనియర్ ఎమ్మెల్యే సెమ్మలై బాంబు పేల్చారు. పన్నీర్ సెల్వం సీఎం కావాలనేది వారి లక్షం అంటూ సేలంలోని ఓ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

శశికళకు పదవి, దినకరన్ కు డబ్బు పిచ్చి
ఎడప్పాడి పళనిసామి వర్గంలోని వారు శశికళకు పదవి పిచ్చి, టీటీవీ దినకరన్ కు డబ్బు పిచ్చి ఉన్న విషయం గుర్తించి విసిగిపోయారని ఎమ్మెల్యే సెమ్మలై అన్నారు. అందుకే శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు, దినకరన్ తీహార్ జైలుకు పరిమితం అయ్యారని ఎమ్మెల్యే సెమ్మలై విమర్శించారు.

మాకు ఎలాంటి ఆశ లేదు
శశికళ, దినకరన్ లకు ఉన్న ఆశలు మాకు లేవని, అందుకే అన్నాడీఎంకే కార్యకర్తలు మా వైపు ఉన్నారని, వారు కూడా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావాలని అంటున్నారని సెమ్మలై సంచలన వ్యాఖ్యలు చేసి పుండు మీద కారం మరింత చల్లినట్లు చేశారు.

పన్నీర్ సెల్వంకు జై అన్నారా ?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వర్గం ఇప్పుడు పన్నీర్ సెల్వంకు జై అంటున్న ఆ 12 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యేలు ఎవరు ? అంటూ చర్చ మొదలుపెట్టారు. గుట్టుచప్పుడు కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేల మీద నిఘా వేశారు.

పన్నీర్ సెల్వం మునిగే నావ
ఈ విషయంపై తమిళనాడు మంత్రి జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ పన్నీర్ సెల్వం మునిగిపోయే నావ అన్నారు. ఆయన నావలో ఎక్కిన వాళ్లు సముద్రంలో గల్లంతు అవుతారని, ఇప్పటికే ఆ నావకు చాల చిల్లులు పడ్డాయని వ్యంగంగా అన్నారు.

పన్నీర్ వర్గానికి తల పొగరు
చర్చలకు రమ్మంటే ఈ రోజు రేపు అంటూ కాలం వెళ్లదీస్తున్న పన్నీర్ సెల్వం వర్గీయులకు తల పొగరు ఎక్కువగా ఉందని మంత్రి జయకుమార్ మండిపడ్డారు. తాము చర్చలకు సిద్దంగా ఉన్నామని చెప్పినా వారు మంత్రం ముందుకు రాలేదని ఆరోపించారు.

పన్నీర్ కు తంబిదురై సవాల్
పన్నీర్ సెల్వం చెప్పినట్లు శాసన సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై అన్నారు. చర్చలు సామరస్యంగా సాగాలనేదే తన అభిమతం అని తంబిదురై మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications