శశికళ భర్త పరుగో పరుగు: అరెస్టు చేస్తారని అజ్ఞాతంలోకి: మన్నార్ గుడి హడల్ !
చెన్నై: తమిళనాడులో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తమిళనాడులో తాను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అధికారంలో ఉందని శశికళ, ఆమె కుటుంబ సభ్యులు అనుకుంటున్న సమయంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో మన్నార్ గుడి మాఫియా సభ్యులు షాక్ కు గురైనారు.
శశికళ ఫ్యామిలీ కొత్త పార్టీ ! మన్నార్ గుడి మాఫియా భారీ స్కెచ్: రాత్రికి రాత్రి ఫ్లెక్సీలు!
ఎన్నికల కమిషన్ కు లంచం ఎర వేశారని ఆరోపిస్తూ టీటీవీ దినకరన్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించారు. టీటీవీ దినకరన్ తో పాటు బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్, మల్లికార్జన్, మరో ఇద్దరిని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించారు.
లిస్టులో శశికళ ఫ్యామిలీ
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) నుంచి టోపీ గుర్తు మీద పోటీ చేసిన టీటీవీ దినకరన్ నానా హంగామా చేశాడు. సీఎంతో పాటు పలువురు మంత్రులు టీటీవీ దినకరన్ కు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో విచ్చలవిడిగా వ్యవహరించాడు. అప్పటి నుంచి శశికళ ఫ్యామిలీ మీద అధికారులు కన్ను వేశారు.
వీడియో క్లిప్పంగ్స్ లో అడ్డంగా చిక్కిపోయారు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా స్థానిక ఓటర్లకు ఒక్కోక్కరిని రూ. 4,000 పంపిణి చేసిన టీటీవీ దినకరన్ అనుచరులు ఓ వీడియోలో అడ్డంగా చిక్కిపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియో ఆధారంగా ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది.
దినకరన్ పిచ్చి చేష్టలకు
దినకరన్ చేసిన నానా హంగామా కారణంగా తమిళనాడు రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో రూ. 89 కోట్లు ఓటర్లకు బట్వాడా చేశారని గుర్తించిన ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలు రద్దు చేసి విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
మద్దతు ఇచ్చిన పాపానికి మరుసటి రోజే
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ కు మద్దతు ఇస్తున్నానని సినీ నటుడు, సమతువ పార్టీ వ్యవస్థాపకుడు శరత్ కుమార్ ప్రకటించిన మరుసటి రోజే ఆయన ఇంటి మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేశారు. శరత్ కుమార్ తో పాటు ఆయన సతీమణి రాధికకు సమన్లు జారీ చేసి విచారణ చేశారు. విచారణ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇదే సమయంలో తమిళనాడు మంత్రి విజయభాస్కర్, ఆయన కుటుంబ సభ్యుల మీద ఐటీ శాఖ అధికారులు దాడి చేశారు.
ఎన్నికల కమిషన్ దెబ్బకు
ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎర వేశారని నమోదు అయిన కేసులో ఢిల్లీ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోనే మకాం వేసిన అధికారులు టీటీవీ దినకరన్ పుట్టుపూర్వోత్తరాలు బయటకులాగుతున్నారు. ఆయన కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు.
శశికళ భర్త, అల్లుడు వివేక్
శశికళ భర్త నటరాజన్, ఆమె మేనల్లుడు, జాజ్ సినిమాస్ సీఈవో వివేక్ మీద ఆదాయపన్ను శాఖ దాడులు జరిగే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దినకరన్ ఒక్కడే ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వడానికి రూ. 50 కోట్లు సమకూర్చడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు.
అరెస్టు భయంతో
మన్నార్ గుడి మాఫియా సభ్యుల్లోని శశికళ భర్త నటరాజన్, ఆమె మేనల్లుడు వివేక్ ఆదాయపన్ను శాఖ అధికారుల టార్గెట్ లిస్టులో ఉన్నాడని జోరుగా ప్రచారం జరగుతోంది. ఇదే సమయంలో అరెస్టు భయంతో శశికళ భర్త నటరాజన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చిన్నమ్మ వర్గంలోని నాయకులే అంటున్నారు.
చేసిన తప్పుతో ఇప్పుడు ఇబ్బందులు
శశికళ కుటుంబ సభ్యులు కొత్త పార్టీ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. బుధవారం రాత్రికిరాత్రే టీటీవీ దినకరన్ పేరవై పేరుతో ఫ్లెక్సీలు, పోస్టర్లు దర్శనం ఇచ్చాయి. విషయం తెలుసుకున్న ఐటీ శాఖ అధికారులు రంగంలోకి దిగారని సమాచారం. ఇదే సందర్బంలో శశికళ భర్త నటరాజన్ అజ్ఞాతంలో వెళ్లిపోవడంతో తీవ్రస్థాయిలో చర్చ మొదలైయ్యింది.
నో కామంట్ అంటున్న మన్నార్ గుడి
నటరాజ్ ఎమైనా బెంగళూరు జైల్లో భార్య శశికళను చూడటానికి వెళ్లారా ? ఎక్కడికి వెళ్లారు ? అని తమిళ మీడియా మన్నార్ గుడి ఫ్యామిలీ సభ్యుల దగ్గర ఆరా తియ్యడానికి ప్రయత్నించడంతో వారు నో కామెంట్ అంటూ తప్పించుకుంటున్నారని సమాచారం.