అప్పుడే 'జయ'పై శశికళ చక్రం: బీజేపీ వద్ద ప్లాన్ 'బీ' ఉందా?
అందరూ ఊహించినట్లుగానే, అలాగే, కొంత ఉత్కంఠ మధ్య శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులు వేస్తున్నారు.
చెన్నై: జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అందరూ ఊహించినట్లుగానే, అలాగే, కొంత ఉత్కంఠ మధ్య శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులు వేస్తున్నారు.
జయలలిత జీవించి ఉన్నప్పుడు శశికళ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దశాబ్దాల పాటు ఆమెతో ఉన్నారు. జయ పలు నిర్ణయాల వెనుక శశికళ మాస్టర్ మైండ్ ఉందని అంటారు. జయ మృతి తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వ పగ్గాలు కోసం పావులు కదుపుతున్నారు.
పన్నీరుకు చుక్కలు,పీఠం దిగేందుకు నో:శశికళతో మంత్రులు, పావులు
అసలు, జయలలిత మృతి వెనుక కుట్ర దాగి ఉందనేది చాలామంది అనుమానం. జయకు అందించిన చికిత్స తదితర వివరాలు అందించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోర్టులకు కూడా ఎక్కారు.
పన్నీరు సెల్వంకు షాక్
ప్రస్తుతం, ఎప్పుడైనా పన్నీరు సెల్వంను పక్కన పెట్టి శశికళకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు పార్టీ పగ్గాలు సిద్ధంగా ఉన్నాయి. మంత్రులు కూడా ఆమెకు మద్దతు పలుకుతున్నారు. ఇది పన్నీరు సెల్వం జీర్ణించుకోలేని విషయమే.
జయ ఉండగా రాజకీయాలకు దూరం
జయలలిత బతికి ఉండగా శశికళ రాజకీయాల్లోకి వచ్చే ధైర్యం చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం చక్రం తిప్పుతున్నారు. జయ ఉంటే అసలు ఆమె రాజకీయాలకు పూర్దిగా దూరంగా ఉండేవారని చెబుతున్నారు.
షరతులు
2011లో తనను దూరం పెట్టిన తర్వాత, ఆమె క్షమాపణ కోరి తిరిగి జయలలిత పంచన చేరారనే వాదనలు ఉన్నాయి. రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని, రాజకీయ పదవులు ఆశించవద్దని జయ షరతు పెడితే శశికళ అంగీకరించినట్లుగా కూడా ప్రచారం ఉంది.
జైలులో ఉండగా పావులు..
మరో విషయమేమంటే.. జైలులో ఉన్నప్పుడు జయ నెట్ వర్క్ను నడిపే మావిస్ శాట్కమ్ కంపెనీలో శశికళ 75 శాతం వాటాను కొనుగోలు చేశారని అంటున్నారు. అక్రమాస్తుల కేసులో జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్లకు కోర్టు 2014లో జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత వారు బెయిల్ పైన బయటకు వచ్చారు. అప్పుడు అక్టోబర్ నెల ఒకటో తేదీన మావిస్ షేర్లు ట్రాన్సుఫర్ చేస్తున్నట్లు నోటీసు ఇష్యూ అయింది.
చిన్నమ్మకు ఎనభై శాతం షేర్లు
ఆ తర్వాత పది రోజులకు 75 శాతానికి పైగా షేర్లు.. ఇద్దరు డైరెక్టర్ల నుంచి శశికళ పేరుకు బదలీ అయినట్లు ఖరారు చేశారు. వెంకటేష్, మరుదప్ప అనే ఇద్దరి డైరెక్టర్ల నుంచి బదలీ అయింది డెబ్బై అయిదు శాతానికి పైగా ఉంది.మొత్తంగా 2015 నాటికి జయ టీవీలో శశికళ షేర్లు 80 శాతం వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా, గత ఏడాది డిసెంబర్ 5న జయ చనిపోయినట్లు తొలుత జయ టీవీలోనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
బీజేపీకి ప్లాన్ బీ ఉందా?
మరోవైపు, తమిళనాడు ఎదిగేందుకు బీజేపీ వద్ద ప్లాన్ బీ ఉందా అనే చర్చ సాగుతోంది. తొలుత శశికళను, పన్నీరు సెల్వంను దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత శశికళతో టచ్లో ఉంటూ పన్నీరు సెల్వం ద్వారా చక్రం తిప్పే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు కేంద్రమంత్రి వెంకయ్య మాట్లాడుతూ.. జయలలిత లేకపోవడం తమకు మంచి అవకాశమని చెబుతున్నారు. అంటే బీజేపీ వద్ద ప్లాన్ బీ ఉందా అనే చర్చ సాగుతోంది.