ఎయిర్ ఇండియాలో మాంసాహారం రగడ, మార్పులేదు
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానాల్లో అందించే ఆహారంపై వివాదం తలెత్తింది. మాంసాహారం బదులుగా శాకాహారం ఇస్తామంటూ చేసిన ప్రకటన వివాదానికి దారి తీసింది. దీనిని ఖండించిన ఎయిర్ ఇండియా... మెరుగైన ఆహారాన్నే ఇస్తున్నామని వివరణ ఇచ్చింది.
ఎయిర్ ఇండియా ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని కేంద్రమంత్రి మహేశ్ శర్మ పేర్కొన్నారు. జనవరి 1 నుంచి తమ విమానాల్లో గంటన్నర వ్యవధిలో ప్రయాణించే ఎకానమీ తరగతి ప్రయాణికులకు మాంసాహార పదార్థాలను అందించకూడదనీ, మధ్యాహ్న, రాత్రి భోజనాల్లో టీ, కాఫీలను తొలగించాలని నిర్ణయించింది.

2016 జనవరి 1 నుంచి దేశీయంగా 61 నుంచి 90 నిమిషాల వ్యవధిలో ప్రయాణించే అన్ని విమానాల్లో వేడివేడి భారతీయ శాకాహార భోజనాన్ని అందజేయనున్నట్లు ఎయిర్ ఇండియా ఈ నెల 23న జారీ చేసిన ఓ ఉత్తర్వులో పేర్కొంది. దీనిపై విమర్శలు వచ్చాయి.
దీనిపై పౌర విమానయానశాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ స్పందిస్తూ... ఎయిర్ ఇండియా మాంసాహారాన్ని నిషేధించిందనేది అపోహ మాత్రమేననీ, ఆహార పదార్థాల పట్టికలో ఎలాంటి మార్పులూ లేవనీ, కొన్నింటిని మెరుగుపరిచినట్లు చెప్పారు.
స్వల్ప వ్యవధి విమానాల్లో కొత్త ఏడాది నుంచి వేడివేడి సమోసా వంటి శాకాహార పదార్థాల్ని పంపిణీ చేస్తుందన్నారు. తరచూ ప్రయాణం చేసేవారు వేడివేడి ఆహారం కావాలని విన్నవించడంతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయనీ, సుదీర్ఘంగా ప్రయాణించే విమానాల్లో ఎలాంటి మార్పులూ ఉండవన్నారు.












Click it and Unblock the Notifications