క్షణాల్లో తప్పిన ప్రమాదం: ఎదురెదురుగా ఎయిరిండియా-విస్తారా విమానాలు, మహిళ పైలట్ కోహ్లీకి ప్రశంస
ముంబై: ఎదురెదురుగా వచ్చిన ఎయిరిండియా- విస్తారా విమానాలు ఒక్కసారిగా ఆందోళనకు గురిచేశాయి. ఓ మహిళ పైలట్ సమయస్ఫూర్తితో వేగంగా స్పందించడంతో క్షణాల్లో 261 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
దీంతో ప్రయాణికులతోపాటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబై ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఎదురెదురుగా విమానాలు
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం(ఫిబ్రవరి 7న) రాత్రి 8.20 గంటల ప్రాంతంలో ముంబై నుంచి భోపాల్ వెళ్తున్న ఎయిరిండియా ఎయిర్బస్ ఏ1631, ఢిల్లీ నుంచి పుణే వెళ్తున్న విస్తార యూకే997 ముంబై ఎయిర్ స్పేస్లో ఎదురెదురుగా వచ్చాయి. దాదాపు 100 అడుగుల దగ్గరగా ఈ రెండు విమానాలు వచ్చాయి.

వెంటనే స్పందించిన మహిళా పైలట్
విస్తార విమానంలో 152 మంది ప్రయాణికులుండగా.. ఎయిరిండియా విమానంలో 109 మంది.. మొత్తం రెండు విమానాల్లో కలిపి ప్రయాణికులు 261మంది ప్రయాణికులున్నారు. ఇరు విమానాలు దగ్గరకు సమీపిస్తున్న తరుణంలో ఆ విమానాల పైలెట్లకు ఆటోమేటిక్ వార్నింగ్ అలర్ట్లు వెళ్లాయి. సెకన్లలో రెండు విమానాలు ఢీకొట్టుకోబోతున్నాయన్న తరుణంలో.. వెంటనే స్పందించిన ఎయిరిండియా మహిళా పైలెట్ అనుపమ కోహ్లి అడ్వయిజరీ ఆదేశాలను పాటిస్తూ... ఎయిర్క్రాఫ్ట్ను సురక్షితమైన దూరంగా మరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

విస్తారా పైలట్ నిర్వాకమే
విస్తార విమానం అదే అవరోహణ మార్గంలో ప్రయాణించింది. ఎట్టకేలకు తమ పైలెట్ సరియైన సమయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవడంతో.. పెను ప్రమాదం నుంచి బయటపడినట్టు ఎయిరిండియా అధికారులు చెప్పారు. ఎయిరిండియా ఎయిర్క్రాఫ్ట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలు పాటిస్తూ వెళ్తోందని.. విస్తారా పైలెటే తప్పుడు మార్గంలో విమానాన్ని నడిపినట్టు ఎయిరిండియా అధికారులు ఆరోపించారు.
విస్తారా ఎయిర్క్రాఫ్ట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలకు విరుద్ధంగా ప్రయాణించినట్టు తెలిపాయి.

ప్రమాదం అంచువరకు.. విస్తారా పైలట్ల తొలగింపు
తాను విమానాన్ని సురక్షితమైన మార్గంలోకి మరలించకముందు రెండు విమానాలు కేవలం 100 అడుగుల దూరంలోనే ఉన్నట్టు కోహ్లీ.. తన రెజుల్యూషన్ అడ్వయిజరీకి రిపోర్టు చేసింది. విస్తారా సైతం ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. తన ఇద్దరు పైలెట్లను విధుల నుంచి తొలగించింది. ఎయిరిండియా 27వేల అడుగుల స్థాయిలో ప్రయాణిస్తుండగా.. విస్తారా విమానం 8 గంటల తర్వాత 27,100 అడుగుల స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఈ రెండు విమానాలు ప్రమాదం అంచు వరకు వెళ్లాయి. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ వ్యవహారంపై విచారణ చేపట్టింది.












Click it and Unblock the Notifications