ముదిరిన సంక్షోభం: ఎయిరిండియా అలర్ట్: ఉక్రెయిన్కు విమానాలు: తేదీలివే..బుకింగ్ ఓపెన్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో నెలకొన్న తాజా పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొద్దిరోజులుగా చోటు చేసుకుంటూ వస్తోన్న ఘర్షణ వైఖరి రోజురోజుకూ మరింత తీవ్రరూపాన్ని దాల్చుతోంది. సరిహద్దులకు పెద్దఎత్తున తన సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని తరలించింది రష్యా. రెండు లక్షల మందికి పైగా సైన్యాన్ని చేరవేసింది. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి అగ్రరాజ్యం అమెరికా చేస్తోన్న ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించట్లేదు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం రావడమంటూ జరిగితే దాని తీవ్రత అంచనాలకు మించి ఉండొచ్చనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమౌతోన్నాయి. యూరోపియన్ వార్గా మారుతుందనే అంచనాలు నెలకొని ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ వ్యవహారంలో ఎవరి పక్షాన నిల్చోవాలనే విషయాన్ని అమెరికా సైతం తన వైఖరిని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ వైపే మొగ్గు చూపింది. ఉక్రెయిన్కు అండగా ఉంటామని, రష్యాపై కఠిన ఆంక్షలను విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అమెరికన్ సెనెట్ ఓ తీర్మానాన్ని కూడా ఆమోదించింది.
ఈ పరిణామాలతో భారత్ అప్రమత్తమైంది. అక్కడి ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. కీవ్లోని రాయబార కార్యాలయం నుంచి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెప్పించుకుంటోంది. రష్యా సైనిక చర్యకు దిగడమంటూ జరిగితే- అక్కడ ఏర్పడే పరిణామాలను అంచనా వేస్తోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే- ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే విషయం మీద ఆరా తీస్తోంది.
ఈ నేపథ్యంలో- ఉక్రెయిన్లో నివసిస్తోన్న భారతీయులు, విద్యార్థులకు కీలక ఆదేశాలను జారీ చేసింది. తక్షణమే స్వదేశానికి రావాలంటూ సూచించింది. అత్యవసర పనుల కోసం ఉన్న వారు మినహా.. మిగిలిన వారందరూ వెంటనే స్వదేశానికి వచ్చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం కొద్దిసేపటి కిందటే అడ్వైజరీని జారీ చేసింది. అత్యవసర పనుల కోసం ఉక్రెయిన్లో నివసించే భారతీయులు ఎప్పటికప్పుడు తమ సమాచారాన్ని రాయబార కార్యాలయానికి తెలియజేయాలని కోరింది.
#FlyAI : Air India will operate 3 flights between India-Ukraine (Boryspil International Airport) India on 22nd, 24th & 26th FEB 2022
— Air India (@airindiain) February 18, 2022
Booking open through Air India Booking offices, Website, Call Centre and Authorised Travel Agents.@IndiainUkraine
ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థులు, పౌరులు స్వదేశానికి తీసుకుని రావడానికి ఎయిరిండియా రంగంలోకి దిగింది. మూడు విమానాలను నడిపించనుంది. ఈ నెల 22, 24, 26 తేదీల్లో ఈ విమానాలు ఉక్రెయిన్కు బయలుదేరి వెళ్తాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని బోరిస్పిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఈ విమానాలు రాకపోకలు సాగిస్తాయి.
దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. తమ బుకింగ్ కార్యాలయాలు, వెబ్సైట్, కాల్ సెంటర్, ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ప్రయాణికులు తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఎయిరిండియా తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడే చిక్కుకోకుండా.. ముందుజాగ్రత్తగా స్వదేశానికి రాదలిచిన భారతీయ పౌరులు, విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.