Bangalore News: ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొనేందుకు కీలక పరిష్కారం.. గంటల ప్రయాణం కేవలం నిమిషాల్లోనే
Air Taxis: నగరాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వాలు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యక్తిగత వాహనాలు కాకుండా సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థను, కార్ పూలింగ్ వంటి వాటిని వినియోగించుకోవాలని సూచిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలకు తాజాగా ఓ సొల్యూషన్ దొరికింది. రోడ్డుపై రద్దీని నివారించడానికి కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది.
బెంగళూరులోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (CBD) నుంచి దాదాపు 40 కి.మీ దూరంలో ఉన్న కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (KIA)కి వెళ్లడం ఇక మరింత తేలిక కానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ రూట్లో ట్రాఫిక్ కష్టాలకు బ్రేక్ పడనుంది. KIAని నిర్వహిస్తున్న బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (BIAL) మరియు సరళా ఏవియేషన్ లు ఈ వ్యవహారంపై కలిసి పనిచేస్తున్నాయి. అత్యాధునిక మరియు స్థిరమైన పరిష్కారాలను అన్వేషించడానికి రెండు సంస్థలు ఓ అగ్రిమెంట్పై సంతకం చేశాయి.

'మా భాగస్వామ్యం కర్ణాటకలో అధునాతన ఎయిర్ మొబిలిటీ సొల్యూషన్లను అభివృద్ధి చేయడంలో మా నిబద్ధతకు సంబంధించి కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. ఏడు సీట్లతో కూడిన eVTOL (ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్) విమానాల కోసం కొత్త కార్యాచరణ ప్రారంభించాము. ఇది విమాన ప్రయాణ పరిధిని మరియు యాక్సెస్ను విప్లవాత్మకంగా మార్చుతుందని భావిస్తున్నాం. కేవలం కొత్త సాంకేతికతను పరిచయం చేయడం మాత్రమే కాకుండా పరిశుభ్రమైన, వేగవంతమైన మరియు అధునాతన భవిష్యత్తును సృష్టించడంలో ఇదొక ముందడుగు' అని BIAL Xలో పోస్ట్ చేసింది.
ప్రపంచంలో రద్దీగా ఉండే 4 నగరాలు ముంబయి, బెంగళూరు, ఢిల్లీ మరియు పూణేలను లక్ష్యంగా చేసుకుని అర్బన్ మొబిలిటీని మార్చడమే తమ లక్ష్యమని సరళ ఏవియేషన్ వెబ్సైట్లో పేర్కొంది. 'ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉబెర్ లేదా ఓలా రైడ్ల మాదిరిగా ఎయిర్ రైడ్-షేరింగ్ సర్వీసును సరసమైన ధరకు అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నాము. విభిన్న వినియోగదారుల కోసం సమర్థవంతమైన రవాణా వ్యవస్థను ప్రవేశపెడతాము' అని కంపెనీ వెల్లడించిది.
బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్స్ సిటీ వరకు దూరాన్ని కేవలం 19 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చని సరళ ఏవియేషన్ వెబ్సైట్ తెలిపింది. ఇందుకు 1,700 ఖర్చు అవుతుందని వివరించింది. ప్రీమియం క్యాబ్లకు 152 నిమిషాలు పడుతుండగా.. అదే 37.5 కి.మీ దూరానికి దాదాపు 2,500 వెచ్చించాల్సి వస్తోందని పోల్చి చెప్పింది. ఇందిరానగర్ నుంచి విమానాశ్రయానికి ఇప్పుడు 1.5 గంటలు ప్రయాణించాల్సి ఉంది. కాగా అతి త్వరలో ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీల ద్వారా దానిని కేవలం 5 నిమిషాలకు తగ్గిస్తామని సదరు సంస్థ బల్లగుద్ది చెబుతోంది.
కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాల్లో సంస్థ ఈ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రోటోటైప్ను నిర్మించడంతో పాటు రెగ్యులేటరీల ఆమోదం లభించాల్సి ఉంది. గతంలో థంబీ ఏవియేషన్ మరియు బ్లేడ్ ఇండియా కంపెనీలు ఇంట్రాసిటీ హెలీ-టాక్సీ సేవలను ప్రారంభించాయి. KIAని HAL మరియు ఎలక్ట్రానిక్స్ సిటీతో అనుసంధానం చేశాయి. అయితే అనుకున్న స్థాయిలో ఆదరణ లేకపోవడంతో ఈ సేవలు నిలిపివేయబడ్డాయి. దీంతో వీటి భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.












Click it and Unblock the Notifications