omicron virus : అంతర్జాతీయ విమాన టికెట్ల ధరలకు రెక్కలు-చాలా మార్గాల్లో రెట్టింపు వసూళ్లు
భారత్ ను ఓమిక్రాన్ వైరస్ భయాలు వెంటాడుతున్నాయి. కేంద్రం ఇప్పటికే భారత్ లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్తున్నా జనం మాత్రం నమ్మడం లేదు. ఓవైపు ప్రపంచ ఆరోగ్య సంస్ధ జారీ చేస్తున్న హెచ్చరికలు, విదేశాల్లో వేగంగా వైరస్ వ్యాపిస్తున్నట్లు వస్తున్న వార్తలు జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీంతో కేంద్రం ఓ క్షణమైనా విమాన ప్రయాణాల్ని నిలిపేయొచ్చన్న భయాలు మొదలయ్యాయి. దీంతో డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయింది.
భారత్ లోకి వచ్చేందుకు ఓమిక్రాన్ ప్రభావిత దేశాల ప్రయాణికులపై కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. భారత్ లోకి ఎంటరైన తర్వాత క్వారంటైన్, వ్యాక్సిన్ నిబంధనలు విధిస్తోంది. అదే సమయంలో భారత్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే వారికి కూడా చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యూఎస్, బ్రిటన్, కెనడా, యూఏఈ వంటి దేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులకు విమాన టికెట్ల ధరలు మంట పుట్టిస్తున్నాయి. ఆయా మార్గాల్లో ఉన్న డిమాండ్ ను బట్టి ఈ రేట్లు ఉంటున్నాయి. దీంతో అంతర్జాతీయ ప్రయాణాలంటేనే బెంబేలెత్తాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి.
ఢిల్లీ నుండి కెనడాలోని టొరంటోకి ప్రస్తుతం అతి తక్కువ విమాన టికెట్ ధర ఇప్పుడు సుమారు రూ.2.37 లక్షలకు పెరిగింది. మామూలు రోజుల్లో దీని ధర సుమారు రూ. 80,000 మాత్రమే. అడ్మిషన్ల సీజన్లో బ్రిటన్ 'రెడ్ లిస్ట్' నుండి భారతదేశం తొలగించబడినప్పటి నుంచి, విమాన ఛార్జీలు పెరగడం ప్రారంభించాయి. తక్కువ విమానాలు, గరిష్ట డిమాండ్ కారణంగా రిటర్న్ టిక్కెట్లకు గిరాకీ పెరిగింది. ఢిల్లీ నుండి లండన్కు దాదాపు ₹ 1.2 లక్షల ధర పలుకుతోంది. అంతకుముందు ఇది రూ.60,000 మాత్రమే. అలాగే ఢిల్లీ నుంచి యూఏఈకి తిరిగి వచ్చే విమానాల ధర దాదాపు రెట్టింపు అయింది. ఇది ప్రస్తుతం రూ. 33,000కు పెరిగింది. ఇంతకు ముందు, ఒక రౌండ్ ట్రిప్ ధర సుమారు రూ.20,000 మాత్రమే.
సగటున, భారత్-యూఎస్ రిటర్న్ టిక్కెట్ల ధర సుమారుగా రూ. 90,000 నుంచి రూ. 1.2 లక్షల మధ్య ఉండేది, ఇప్పుడు దాదాపు రూ.1.7 లక్షలకుపెరిగి పోయింది. చికాగో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ నగరాలకు విమాన ఛార్జీలు 100 శాతం పెరిగాయి. బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధరలు దాదాపు రూ.6 లక్షలకు పెరిగిపోయాయంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు.