‘పనామా పేపర్ల’పై నోరువిప్పిన ఐశ్వర్యారాయ్
న్యూఢిల్లీ: పనామా పత్రాల వివాదంపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కోడలు, నటి ఐశ్యర్యరాయ్ బచ్చన్ తాజాగా స్పందించారు. పన్ను ఎగ్గొట్టేందుకు విదేశాల్లో బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసిన వ్యవహారంలో ఐశ్యర్య, ఆమె తల్లి తరఫు కుటుంబసభ్యుల పేర్లు ఉన్నట్టు ఇటీవల పనామా పత్రాల్లో వెల్లడైన విషయం తెలిసిందే.
కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించి సహకరిస్తున్నట్టు ఐశ్వర్యరాయ్ తెలిపారు. ఆమెను మంగళవారం మీడియా పనామా పత్రాల విషయమై ప్రశ్నించగా ఈ మేరకు బదులిచ్చారు.
'ఇప్పటికే ఈ విషయమై ఓ ప్రకటన చేశాను. ఈ విషయంలో కుటుంబపరంగా, వ్యక్తిగతంగా కూడా ప్రకటన చేశాం. మీడియాకు కూడా మా వైఖరి తెలియజేశాం. ఇక ఈ విషయంలో అన్ని ప్రశ్నలకు ప్రభుత్వానికి సమాధానం ఇచ్చాం. ఇస్తున్నాం. థాంక్యూ' అంటూ ఐశ్వర్యరాయ్ ముగించారు.
పనామాకు చెందిన మొసాక్ ఫోన్సెకా కంపెనీ ద్వారా విదేశాల్లో బోగస్ కంపెనీలు స్థాపించిన 500 మంది భారతీయ ప్రముఖుల పేర్లతోపాటు అమితాబ్ బచ్చన్, ఐశ్యర్యరాయ్ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాగా, ఐశ్యర్య అధికార ప్రతినిధి కూడా ఆమెపై వచ్చిన ఆరోపణలను గతంలో తోసిపుచ్చారు. అమితాబ్ కూడా వివరణ ఇచ్చుకున్నారు.