జాలేస్తోంది: అజయ్ మాకెన్పై విరుచుకుపడిన షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత షీలా దీక్షిత్ తమ కాంగ్రెసు పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అజయ్ మాకెన్పై తీవ్రంగా ధ్వజమెత్తారు. అజయ్ మాకెన్ను చూస్తే జాలేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. అజయ్ మాకెన్ వ్యవహార శైలే కొంప ముంచిందని ఆమె అన్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడమే కాకుండా దాని ఓట్ల శాతం కూడా గణనీయంగా తగ్గిపోయిన విషయం తెలిసిందే.
తమ కాంగ్రెసు పార్టీ విశ్వాసాన్ని కలిగించలేకపోయిందని, తాము ఒక్క సీటు కూడా గెలుచుకోలేమని తెలియనప్పటికీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతామని తెలుసునని, అయితే తాను అజయ్ మాకెన్ గురించి మాట్లాడదలుచుకున్నానని, ఆయనను చూస్తే జాలేస్తుందని ఆమె అన్నారు.

అజయ్ మాకెన్ చేతికి నాయకత్వం వచ్చిందని, అంగీకరించారని, అయితే ఆయన వ్యవహార శైలి కాంగ్రెసుకు ఉపయోగపడలేదని ఆమె అన్నారు. కాంగ్రెసు ప్రచారం దూకుడుగా ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రచార కమిటీ సారథి అజయ్ మాకెన్ అని, ప్రచారం దూకుడుగా ఉండాల్సిందని, వ్యూహరచనలో లోపం ఉందని, మొత్తంగా కాంగ్రెసు పార్టీ నైతికంగా దెబ్బ తిన్నదని షీలా దీక్షిత్ అన్నారు.
ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తాను ఇచ్చిన 70 హామీలను అమలు చేయాల్సి ఉందని షీలా అన్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బిజెపి, కాంగ్రెసు పార్టీలను మట్టి కరిపించిన విషయం తెలిసిందే. బిజెపి కేవలం మూడు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications