బీజేపీ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కుమార్?: బీజేపీ డైలమా
బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా మృతితో ఖాళీ అయిన గురుదాస్పూర్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ ఎవరిని బరిలోకి దింపుతుంది? అనే చర్చ సాగుతోంది. దీనిపై బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది.
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా మృతితో ఖాళీ అయిన గురుదాస్పూర్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ ఎవరిని బరిలోకి దింపుతుంది? అనే చర్చ సాగుతోంది. దీనిపై బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ బీజేపీ అభ్యర్థిగా నిలుస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అవన్నీ పుకార్లేనని అక్షయ్ కొట్టి పారేశారు. బీజేపీ కూడా ఆయన కోసం ప్రయత్నాలు చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన సినిమాల్లో మరీ బిజీగా ఉండటంతో కుదరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అక్షయ్ సామాజిక అంశాల నేపథ్యంలో సినిమాలు చేస్తుంటారని ఆయనకి కచ్చితంగా రాజకీయాలపై అవగాహన ఉంటుందన్నది బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు. అదీకాకుండా ఇటీవల జవాన్ల అభ్యున్నతి కోసం సొంతంగా ఓ వెబ్సైట్ కూడా ప్రారంభించారు. కానీ అవన్నీ వట్టివే అంటున్నారు.
నటుడు రిషి కపూర్ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన ట్విటర్ వేదికగా వ్యక్తిగత, సామాజిక అంశాలపై అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు. అదీకాకుండా కపూర్ కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరూ రాజకీయాల్లో పోటీ చేయలేదు.
దాంతో ఆ ఎంపీ సీటు రిషి కపూర్కి ఇచ్చే అవకాశముందనే ప్రచారం సాగింది. బీజేపీ మాత్రం ఎవరైతే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని పోటీ చేసి గెలవగలరో వారికే ఎంపీ పదవి ఇవ్వాలనుకుంటోందట. అలాగే, వినోద్ ఖన్నా సతీమణి లేదా ఆయన కుమారుడు అక్షయ్ ఖన్నా పేర్లు కూడా వినిపిస్తున్నాయి.