ట్యాంకులో నీళ్లు నింపలేదని తండ్రినే హత్య చేసిన కొడుకు..
రెండు రోజల క్రితం పీకల దాకా తాగొచ్చిన చేతన్.. ట్యాంకులో నీళ్లెందుకు నింపలేదని తండ్రితో గొడవపెట్టుకున్నాడు. తండ్రిపై ఆగ్రహంతో రగిలిపోయాడు.
బిందాపూర్: ట్యాంకులో నీళ్లు నింపలేదన్న కారణంగా ఏకంగా తండ్రినే పొట్టనబెట్టుకున్నాడు ఓ మందుబాబు. ఢిల్లీలోని బిందాపూర్ లో జరిగిన ఈ ఘటన స్థానికులను షాక్ కు గురిచేసింది. కొడుకు దాడిలో తండ్రి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఎంటీఎన్ఎల్ సంస్థలో లైన్ మెన్ గా పనిచేసిన రామ్ కుమార్(75) రిటైర్డ్ అయి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఖుషీ రామ్ పార్క్ లోని ఓ అపార్ట్ మెంటు ప్లాటులో ఇతను నివాసముంటుండగా.. అదే అపార్ట్ మెంటులోని మరో ప్లాటులో అతని కొడుకు చేతన్ ఉంటున్నాడు.
రామ్ కుమార్ భార్య చనిపోగా.. కొడుకు చేతన్ భార్య అతన్ని విడిచిపెట్టి వెళ్లింది. దీంతో కొన్నాళ్లుగా కూతురితో కలిసి తండ్రి ఫ్లాటులోనే చేతన్ ఉంటున్నాడు. రెండు రోజల క్రితం పీకల దాకా తాగొచ్చిన చేతన్.. ట్యాంకులో నీళ్లెందుకు నింపలేదని తండ్రితో గొడవపెట్టుకున్నాడు. తండ్రిపై ఆగ్రహంతో రగిలిపోయాడు.
కుమార్తె ముందే విచక్షణా రహితంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రామ్ కుమార్ అరుపులు విన్న స్థానికులు రోజూ ఉండే గొడవే అనుకున్నారు. అయితే చేతన్ కుమార్తె బయటకు పరిగెత్తుకెళ్లి చుట్టుపక్కల వాళ్లకు విషయం చెప్పడంతో పోలీసులకు సమాచారం చేరింది.
దీంతో చేతన్ ను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, చేతన్ కుమార్తెనే ఈ ఘటనకు సాక్షిగా ఉండటం గమనార్హం.