దేశం అట్టుడుకుతున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోడీ మెగా ర్యాలీ: ఏం చెబుతారనే ఉత్కంఠత..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, పౌర నమోదు కార్యక్రమాలపై దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా అట్టుడుకుతున్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా ఓ మెగా ర్యాలీని నిర్వహించబోతున్నారు. దేశ రాజధానిలోని రామ్ లీలా మైదానంలో ఆదివారం మధ్యాహ్నం ఈ భారీ ప్రదర్శన ఏర్పాటు కాబోతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు.న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, పౌర నమోదు కార్యక్రమాలపై దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా అట్టుడుకుతున్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా ఓ మెగా ర్యాలీని నిర్వహించబోతున్నారు. దేశ రాజధానిలోని రామ్ లీలా మైదానంలో ఆదివారం మధ్యాహ్నం ఈ భారీ ప్రదర్శన ఏర్పాటు కాబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు.
ఎన్నికల సభల్లో తొలిసారిగా..
దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక వాతావరణం, అల్లర్ల నేపథ్యంలో.. ప్రధాని ఏం చెబుతారనే అంశం ఉత్కంఠతగా మారింది. ప్రజల్లో ఆసక్తిని రేపుతోంది. పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి అటు ప్రధాని మోడీ, ఇటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఇదివరకే తమ అభిప్రాయాలు ఏమిటనేది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల ద్వారా వెల్లడించారు. ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభల్లో భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
మెగా ర్యాలీపై ఆసక్తి..
ఈ సారి రామ్ లీలా మైదానంలో ఏర్పాటు చేయబోయే మెగా ర్యాలీ, భారీ బహిరంగ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించబోతుండటం ప్రాధాన్యతను సంతరిచుకుంది. పౌరసత్వ సవరణ చట్టం, పౌర నమోదు కార్యక్రమాలపై నరేంద్ర మోడీ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు? మరోసారి సవరణలకు అవకాశం ఇస్తారా? హింసాత్మక పరిస్థితులు, ఆందోళనకారుల మనోభావాలను గౌరవిస్తారా? లేదా? అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఆందోళనలు మిన్నంటిన వేళ..
పౌరసత్వ సవరణ చట్టం, పౌర నమోదు కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో అంటుకున్న మంటలు ప్రస్తుతం దేశ రాజధాని సహా దాదాపు అన్ని రాష్ట్రాలను చుట్టబెడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సైతం నిరసన కార్యక్రమాలు, వ్యతిరేక ప్రదర్శనల తీవ్రత ఆకాశాన్ని అంటాయి. పోలీసుల కాల్పులకు దారి తీశాయి. ఈ కాల్పుల్లో కర్ణాటకలోని మంగళూరులో ఇద్దరు, ఉత్తర్ ప్రదేశ్ లో ఒకరు మరణించారు.
ప్రతిష్ఠాత్మకంగా ర్యాలీ..
ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ మెగా ర్యాలీని నిర్వహించడం పట్ల అందరి దృష్టీ దాని పైనే నిలిచింది. ఆయన ఏం చెబుతారనే అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరోవంక- ఈ ర్యాలీని బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మరి కొన్ని నెలల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్న పరిస్థితుల్లో ఈ ర్యాలీని విజయవంతం చేయడంపైనే బీజేపీ నేతలు దృష్టి పెట్టారు. మూడువేలకు పైగా బస్సుల్లో కార్యకర్తలను తరలిస్తున్నారు.