విదేశాల నుంచి వచ్చే వారిపై కఠిన ఆంక్షలు: ఎట్ రిస్క్ దేశాల జాబితా ఇదే
న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి మరోసారి తీవ్ర రూపాన్ని దాల్చింది. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఈ ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు జారీ చేసిన బులెటిన్ ప్రకారం..ఒక్కరోజులోనే 1,17,100 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణకూ అంతు లేకుండా పోయింది. ఒమిక్రాన్ కేసులు 3,007లకు చేరుకున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువైంది. 3,71,363గా రికార్డయింది.
ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో యాక్టివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఆయా గణాంకాలేవీ అక్కడితో ఆగిపోతాయనే గ్యారంటీ లేదు. రోజువారీ కొత్త కేసుల సంఖ్య మరింత భారీగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా, కేరళ, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లో రోజువారీ కేసులు భారీగా రికార్డయ్యాయి. ముంబైలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలను దాటేసింది. కర్ణాటకలో కొత్త కేసులు ఆరువేలను అధిగమించాయి.

ఈ పరిణామాల మధ్య ఈ కేసులను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకుంది. విదేశాల నుంచి వచ్చే వారిపై కఠిన ఆంక్షలను విధించింది. దీనిపై కొత్త కోవిడ్ ప్రొటోకాల్స్ను జారీ చేసింది. విదేశాల నుంచి ఎవరు వచ్చినా.. ఏడు రోజుల పాటు హోమ్ క్వారంటైన్ను తప్పనసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏ దేశం నుంచి వచ్చినా సరే.. స్వదేశీయులైనా సరే తప్పనిసరిగా హోమ్ క్వారంటైన్కు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. 72 గంటల పాటు చెల్లుబాటయ్యేలా ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్ను వారు అందజేయాల్సి ఉంటుంది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారు కూడా క్వారంటైన్కు వెళ్లాల్సి ఉంటుంది. బ్రిటన్ సహా యూరప్లోని అన్ని దేశాలు ఎట్ రిస్క్ జాబితాలో ఉన్నాయి. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్సువానా, చైనా, ఘనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్, కాంగో, ఇథియోపియా, కజకిస్తాన్, కెన్యా, నైజీరియా, ట్యునీషియా, జాంబియాను కేంద్ర ప్రభుత్వం ఈ జాబితాలో చేర్చింది.
దేశంలోని అన్ని విమానాశ్రయాలు తప్పనిసరిగా కోవిడ్ ప్రొటోకాల్స్ను అనుసరించాలని కేంద్రం ఆదేశించింది. థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని, ప్రయాణికులు భౌతిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. బోర్డింగ్ పాసుల జారీ, సెక్యూరిటీ చెకింగ్, కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసే సమయంలో కోవిడ్ ప్రొటోకాల్స్ను పాటించాలని పేర్కొంది. ప్రతిచోట కూడా శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. మాస్కులను ధరించని వారిపై జరిమానాలను విధించడానికి వెనుకాడొద్దని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications