హాఫ్ లాక్డౌన్..నో 50%: ప్రైవేటు కార్యాలయాలు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్: కొత్త గైడ్లైన్స్
దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇదివరకటి కంటే వేగంగా విస్తరిస్తోంది. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ దీనికి తోడైంది. ఒమిక్రాన్ వల్లే దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోందంటూ నిపుణులు సైతం హెచ్చరించారు. దేశంలో పలు నగరాల్లో థర్డ్వేవ్ మొదలైందనే భయాందోళనలు నెలకొని ఉన్నాయి. ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ నైట్ కర్ఫ్యూలు అమల్లో ఉంది.
తాజా బులెటిన్ ప్రకారం..ఒక్కరోజులోనే 1,68,063 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 277 మంది మరణించారు. 69,959 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,58,75,790కు చేరింది. ఇందులో 3,45,70,131 డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు ఎనిమిది లక్షలను దాటాయి. యాక్టివ్ కేసులు 8,21,446గా రికార్డయ్యాయి. 4,84,213 మంది ఇప్పటిదాకా మహమ్మారి బారిన పడి ప్రాణాలొదిలారు. పాజిటివిటీ రేటు 10.64 శాతంగా నమోదైంది.
ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు నాలుగు వేలను దాటాయి. ఇప్పటిదాకా 4,461 కేసులు రికార్డయ్యాయి. ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు తొలి అయిదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో ఇఫ్పటికే వెయ్యికి పైగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో అత్యధిక పాజిటివ్స్ రికార్డయ్యాయి.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటిదాకా అమలు చేస్తూ వచ్చిన కోవిడ్ మార్గదర్శకాలు, నిబంధనలు, ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. హాఫ్ లాక్డౌన్ను ప్రకటించింది. 50 శాతం సామర్థ్యాన్ని కూడా ఎత్తి వేసింది. ప్రైవేటు కార్యాలయాలు, సినిమా థియేటర్లు, బార్ అండ్ రెస్టారెంట్లల్లో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడిపించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని రద్దు చేసింది.
ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని అన్ని ప్రైవేటు కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలంటూ ఆయా సంస్థల యజమానులను ఆదేశించింది. బార్ అండ్ రెస్టారెంట్లల్లో పార్సిల్ సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇదివరకు రెస్టారెంట్లల్లో 50 శాతం సీటింగ్కు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఈ మేరకు డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కొత్త కోవిడ్ ప్రొటోకాల్స్ను జారీ చేసింది.
Recommended Video
కొత్త కేసులతో పాటు ఢిల్లీలో మరణాలు సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో 70 మంది కోవిడ్కు బలి అయ్యారు. మరిన్ని మరణాలు సంభవించే ప్రమాదం లేకపోలేదని అంచనా వేస్తోంది. వీలైనంత వరకు మరణాల సంఖ్యను తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకుంది. అన్ని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్ నిల్వలను సంతృప్తికర స్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని డీడీఎంఏ ఆదేశించింది.