అట్టహాసంగా యోగీ ప్రమాణ స్వీకారం- కిక్కిరిసిన లక్నో స్టేడియం-మోడీ, షా, సీఎంలు హాజరు
ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా రెండోసారి అధికార పగ్గాలు అందుకోబోతున్న యోగీ ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కొద్దిసేపట్లో లక్నోలోని వాజ్ పేయ్ ఎకానా క్రికెట్ స్టేడియంలో జరగబోతోంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలతో పాటు బీజేపీ అగ్రనేతలు, సీఎంలు తరలివస్తున్నారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది.
యోగీతో పాటు దాదాపు 50 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరితో గవర్నర్ కొద్దిసేపట్లో ప్రమాణం చేయించబోతున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు అగ్రనేతలు హాజరయ్యారు. వీరి రాకతో లక్నోలోని వాజ్ పేయ్ స్టేడియంలో సందడి నెలకొంది. రెండోసారి సీఎం కాబోతున్న యోగీ ఆదిత్యనాథ్ విమానాశ్రయానికి వెళ్లి ప్రదాని మోడీని స్టేడియానికి తోడ్కొని వచ్చారు.
లక్నోలోని వాజ్ పేయ్ స్టేడియంలో జరుగుతున్న యోగీ ప్రమాణోత్సవానికి ప్రజలు భారీ ఎత్తున హాజరవుతున్నారు. దీంతో స్టేడియానికి వెళ్లే దారులన్నీ జనంలో కిక్కిరిసిపోయాయి. దీంతో అమిత్ షా కాన్వాయ్ కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. ప్రమాణోత్సవానికి ఆలస్యమవుతుండటంతో అమిత్ షా కాలి నడకన అర కిలోమీటర్ నడిచి స్టేడియానికి చేరుకున్నారు. యోగీ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీతో పాటు పలువురు వీఐపీలు హాజరుకావడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా స్ధానిక పోలీసులతో పాటు సీఐఎస్ఎఫ్ భద్రత కూడా కల్పిస్తున్నారు.