'కేరళ నిర్భయ': దళిత లా విద్యార్ధినిపై రేప్, అసలేం జరిగింది?
తిరువనంతపురం: ఒంటరి తల్లితో కలిసి ఒకే గదిలో నివశిస్తోన్న దళిత యువతిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హతమార్చిన ఘటన కేరళలోని ఎర్నాకుళం జిల్లా పెరుంబవూర్లో జరిగింది. ఢిల్లీలో జరిగిన ఘటన మాదిరి దీనిని 'కేరళ నిర్భయ'గా అభివర్ణిస్తున్న ఈ ఘటనతో కేరళ అట్టుడుకుతోంది.
విద్యార్థి, హక్కుల సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. మే 16న కేరళలో జరగనున్న ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, నిందితులను శిక్షిస్తామని ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్రకటించారు.
సామూహిక అత్యాచారానికి గురై, ప్రాణాలు కోల్పోయిన 30 ఏళ్ల దళిత లా కాలేజీ విద్యార్థిని కుటుంబసభ్యులను ఆయన బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసు విచారణ సరైన మార్గంలోనే కొనసాగుతోందన్నారు. బాధితురాలి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం ఊమెన్ చాందీ హామీ ఇచ్చారు.
మరో దారుణం: ఆటోలో నర్సింగ్ విద్యార్థినిపై గ్యాంగ్రేప్
ఎన్నికల కమిషన్ అనుమతితోనే తాను ఈ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కేసుపై ఆయన ప్రత్యేకంగా దృష్టిపెట్టానని చెప్పుకొచ్చారు. కేరళ ఎస్సీ ఎస్టీ కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. అంతేకాదు నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న నలుగురు అసలైన నేరస్తులా కాదా అనే అంశంపై స్పష్టత లేదని పోలీసులు అంటున్నారు. న్యాయ విద్య చదువుతున్న 30 ఏళ్ల దళిత మహిళపై అత్యాచారం చేశారని, ఆమెపై పదునైన ఆయుధాలతో దాడి చేశారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన ఏప్రిల్ 28న జరిగిందని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. దళిత మహిళను అత్యాచారం అనంతరం గొంతు నులిమి హత్య చేశారని ఎర్నాకుళం రేంజ్ ఐజి మహిపాల్ యాదవ్ చెప్పారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేసును సుమోటోగా పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జేబీ జోషీ... దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, కేసును క్రైం బ్రాంచికి అప్పగించాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటనను విచారించడానికి సిట్ను ఏర్పాటు చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీఎస్ విజయ్ కుమార్ ఆదేశించారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, మహిళా హక్కుల సంఘాలు, విద్యార్ధులు పెద్ద ఎత్తున మంగళవారం ఆందోళన నిర్వహించారు.
బాధితురాలి సోదరికి ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్రకటించారు. మరోవైపు హతమారుస్తామంటూ ఆ యువతికి కొంతకాలంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె తల్లి రాజేశ్వరి తెలిపారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదుచేసినా, పట్టించుకోలేదన్నారు.
'కేరళ నిర్భయ' అసలేం జరిగింది?:
నిరుపేద దళిత మహిళ... ఒంటరి తల్లితో కలిసి ఒకే ఒక గదిలో నివశిస్తోంది. న్యాయ విద్య చదువుకుంటోంది. తల్లి బయటకు పనిపై వెళ్లడంతో ఇంట్లోనే ఉంది. ఈ క్రమంలో సొంత ఇంట్లోనే ఆమెపై అత్యాచారం చేశారు. పదునైన ఆయుధాలతో ఆమె శరీరంపై అత్యంత పాశవికంగా దాడి చేశారు. దీంతో ఆమె కడుపులోని అవయవాలన్నీ బయటకు వచ్చేశాయి.
శరీరంపై ఏకంగా 30 చోట్ల తీవ్ర గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఏప్రిల్ 28న ఎర్నాకుళం జిల్లా పెరంబవూర్లో లా కాలేజీ విద్యార్థినిపై ఆమె ఇంట్లోనే అత్యాచారం చేసి, పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. అత్యాచారం జరిగిన సమయంలో నిందితులతో ఆమె పెనుగులాడినట్లు ఆధారాలున్నాయని పోలీసులు తెలిపారు.