రాజ్యాంగ విరుద్ధం: ట్రిపుల్ తలాఖ్పై అలహాబాద్ కోర్టు సంచలనం
అలహాబాద్: ట్రిపుల్ తలాఖ్ విధానంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముస్లిం మతంలో ఉన్న ట్రిపుల్ తలాఖ్ విధానం రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. మూడుసార్ల ఈ సంప్రదాయాన్ని ప్రోత్సహించడమంటే ముస్లిం మహిళల హక్కులను హరించడమేనని కోర్టు తేల్చి చెప్పింది.
రాజ్యాంగపరంగా ట్రిపుల్ తలాఖ్ ఆమోదయోగ్యం కాదని, దీన్ని ఎవరూ ఆచరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రాజ్యాంగంలో ఉన్న హక్కులను హరించేలా పర్సనల్ లా బోర్డులో ఏదీ ఉండకూడదని హైకోర్టు తెలిపింది. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారని, అందువల్ల ట్రిపుల్ తలాఖ్ ను పాటించాల్సిన అవసరం లేదని తెలిపింది.

చాలా కాలంగా ట్రిపుల్ తలాఖ్ విధానంపై ఎడతెగని వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మూడుసార్లు తలాఖ్ అని చెప్పడం ద్వారా భార్యకు విడాకులు ఇవ్వడం అనే ముస్లిం ఆచారంపై పలు రకాల విమర్శలు, వివాదాలున్నాయి. కేవలం నోటి మాట ద్వారా విడాకులు ఇచ్చేస్తే మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పలువురు వాదిస్తున్నారు.
కాగా, ఇది మతపరమైన ఆచారాలకు సంబంధించిన విషయమని, ఇందులో వేలు పెట్టడం సరికాదని ముస్లిం మత పెద్దలు కొందరు వాదిస్తుండటం గమనార్హం. ఎట్టకేలకు ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో ఈ విషయంపై ఒక స్పష్టత వచ్చినట్లయింది. అయితే, ట్రిపుల్ తలాఖ్ చట్టబద్ధతపై స్పందించేందుకు కోర్టు నిరాకరించింది.












Click it and Unblock the Notifications