మధుర కృష్ణ జన్మభూమి -షాషీ మసీదు వివాదంలో బిగ్ టర్న్..! అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం..!
ఉత్తర్ ప్రదేశ్ లోని మధురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి, దాన్ని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదు యాజమాన్య హక్కుల విషయంలో జరుగుతున్న పోరులో ఇవాళ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే షాహీ మసీదును శ్రీకృష్ణ జన్మభూమిని ఆక్రమించి నిర్మించారంటూ హిందూ వర్గాలు కోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు 1991 నాటి ప్రార్ధనా స్థలాల చట్టాన్ని అతిక్రమించి ఎలాంటి నిర్ణయాలు ప్రకటించవద్దని కోర్టుల్ని ఆదేశించడం జరిగాయి.
ఈ నేపథ్యంలో మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి పక్కనే షాహీ ఈద్గా మసీదు ఉన్న సముదాయాన్ని వివాదాస్పద కట్టడంగా ప్రకటించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో హిందూ వర్గం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషనర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కోర్టు రికార్డుల్లోనూ, తదుపరి విచారణల్లోనూ దీన్ని వివాదాస్పద కట్టడంగా పేర్కొనాలంటూ పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.

ప్రస్తుతం ఈ వివాదంపై జరుగుతున్న విచారణలో కేసు పత్రాలు, భవిష్యత్ విచారణలలో షాహి ఇద్గా మసీదు అనే పదాన్ని వివాదాస్పద నిర్మాణంతో భర్తీ చేయాలని సంబంధిత స్టెనోగ్రాఫర్ను ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. అయితే మసీదుకు సంబంధించిన అధికారిక సూచనలలో అటువంటి మార్పును వ్యతిరేకిస్తూ, ముస్లిం పక్షం ఈ డిమాండ్కు లిఖితపూర్వక అభ్యంతరాన్ని హైకోర్టుకు సమర్పించింది. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత హైకోర్టు పిటిషన్ ను కొట్టేసింది.

మరోవైపు మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి, షాహి ఇద్గా మసీదు చుట్టూ ఉన్న వివాదాస్పద భూమి, మతపరమైన వాదనలకు సంబంధించి హిందూ పక్షంలోని వివిధ సభ్యులు దాఖలు చేసిన 18 పిటిషన్లలో ఈ కేసు కూడా ఒకటి. ఇవాళ హైకోర్టు నిర్ణయం తర్వాత ఈ కేసులో తదుపరి విచారణ ఆగస్టు 2కి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications