అందుకే, నేను కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశాను: శరద్ పవార్
పూణే: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన విషయం తెలిసిందే. బుధవారం పూణేలో ఓ బహిరంగ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఆ పార్టీకి ఎందుకు గుడ్ బై చెప్పాల్సి వచ్చిందో ఆయన తెలిపారు.
1999లో వాజ్పేయి సర్కారు పడిపోవడంతో కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ప్రధాని కావాలనుకున్నారని, ఆ కారణం వల్లే తాను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశానని శరద్ పవార్ చెప్పారు. కాకపోతే దేశంలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం అని ఆయన వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే.. శరద్ పవార్ను ఈ మేరకు ఇంటర్వ్యూ చేయగా పవార్ పలు విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలో చాలా చక్కటి నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయని, ఆయన దేశంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారని అన్నారు.
ఏదో నేర్చుకోవాలనే తపన కాంగ్రెస్ అధ్యక్షుడిలో కనపడుతోందని, ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలంటే రాజకీయాల్లో బలమైన ప్రతిపక్షం అవసరమని శరద్ పవార్ చెప్పారు. రాహుల్ గాంధీకి ప్రజల మద్దతు లభిస్తే.. తిరిగి కాంగ్రెస్ పునరుజ్జీవం పొందుతుందని పేర్కొన్నారు.
అలాగే లోక్సభలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తోన్న విమర్శలు బాగోలేవని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. జవహర్లాల్ నెహ్రూ, కాంగ్రెస్ను మోడీ విమర్శించిన తీరును దుయ్యబట్టారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుకు కూడా ఎన్సీపీ సిద్ధమేనంటూ శరద్ పవార్ సూచనప్రాయంగా తెలిపారు. మహారాష్ట్రలో భావసారూప్యం కలిగిన ఇతర పార్టీలను కూడా తమ కూటమిలో కలుపుకుని 2019 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు యోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.