వ్యాక్సినేషన్పై గందరగోళం-డోసుల మిస్సింగ్-ఉత్పత్తి కంటే తక్కువ వ్యాక్సినేషన్-దేశంలో అసలేం జరుగుతోంది
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్త నడకన సాగుతోంది. ఈ ఏడాది జనవరిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవగా ఇప్పటివరకూ కేవలం 19 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వగలిగారు. ఇందులోనూ రెండో డోసు ఇంకా తీసుకోనివారి సంఖ్య 15 కోట్లకు పైనే. వ్యాక్సిన్ల కొరత కారణంగానే మొదటి డోసుకు,రెండో డోసుకు మధ్య గ్యాప్ను 12-16వారాలకు పెంచారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే... దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి కన్నా వ్యాక్సినేషన్ తక్కువ స్థాయిలో ఉండటం. ఎందుకీ వ్యత్యాసం... లోపం ఎక్కడున్నది... అనే ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు.
Recommended Video

నెలకు 8.5 కోట్ల వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి...
కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతీ నెలా ఆ సంస్థ 6.5 కోట్ల కోవీషీల్డ్ డోసులను ఉత్పత్తి చేస్తోంది. అలాగే భారత్ బయోటెక్ ప్రతీ నెలా 2 కోట్ల కోవాగ్జిన్ డోసులను ఉత్పత్తి చేస్తోంది. మే నెలలో వ్యాక్సిన్ ఉత్పత్తిని 3 కోట్లకు పెంచుతున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. ఈ లెక్కన రెండు కంపెనీల నుంచి నెలకు 8.5 కోట్లకు తక్కువ కాకుండా వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి జరుగుతోంది. అంటే సుమారుగా సగటున ఒకరోజుకు 27.5లక్షల నుంచి 28.5లక్షల డోసులు ఉత్పత్తి చేస్తున్నారు.

వ్యాక్సినేషన్ 5.5 కోట్ల మందికే...
ఒకరోజులో ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ల సంఖ్య సగటున 28 లక్షల వరకు ఉండగా... వ్యాక్సినేషన్ సంఖ్య మాత్రం ఒకరోజుకు సగటున 17.85 లక్షలు మాత్రమే ఉండటమే గమనార్హం. మే 1 నుంచి మే 23 వరకు 4.1కోట్ల మందికి మాత్రమే దేశంలో వ్యాక్సినేషన్ ఇచ్చారు. రోజుకు 17.85 లక్షల వ్యాక్సిన్ డోసులు పరిగణలోకి తీసుకుంటే ఈ నెల 31 నాటికి మరో 1.42 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వగలరు. అంటే మొత్తంగా ఈ నెలలో 5.5 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వగలరు. అయితే సీరమ్ ఇన్స్టిట్యూట్,భారత్ బయోటెక్ మే నెలలో 8.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించగా... ఉత్పత్తికి,జరిగిన-జరుగుతున్న వ్యాక్సినేషన్కు 3 కోట్ల డోసుల గ్యాప్ ఉండటం గమనార్హం.

గ్లోబల్ టెండర్లు బోల్తా...
ఇప్పటికే వ్యాక్సిన్ కొరత కారణంగా చాలా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొన్ని రోజుల పాటు నిలిచిపోయింది. దేశవ్యాప్తంగా 18-44 వయసు వారికి వ్యాక్సినేషన్కు కేంద్రం అనుమతినిచ్చినప్పటికీ వ్యాక్సిన్ల కొరతతో అది ముందుకు సాగట్లేదు.అంతర్జాతీయ మార్కెట్లో నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేసుకోవచ్చునని కేంద్రం రాష్ట్రాలకు చెప్పినప్పటికీ... అక్కడా ప్రతికూలతలే ఎదురవుతున్నాయి. గ్లోబల్ టెండర్లను వ్యాక్సిన్ కంపెనీలు తిరస్కరిస్తున్నాయని పంజాబ్,ఢిల్లీ ప్రభుత్వాలు వెల్లడించాయి. తాము కేంద్రంతో నేరుగా సంప్రదింపులు జరుపుతామని... రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు విక్రయించమని మోడెర్నా,ఫైజర్ కంపెనీలు చెప్పినట్లుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications