అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం-కేజ్రీవాల్ దళిత వ్యతిరేకి..!!
జనవరి 26వ తేదీ దేశం యావత్తు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉండగా పంజాబ్లో మాత్రం పరిస్థితి మరోలా ఉన్నింది. భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం అమృత్సర్లో పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు. 33 అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని సుత్తితో కొట్టి ధ్వంసం చేశాడు దుండగుడు. పోలీసు స్టేషన్కు కూతవేట దూరంలో ఈ ఘటన జరిగింది.ఈ ఘటనతో పంజాబ్ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
అంబేడ్కర్ విగ్రహ ధ్వంసం ఘటనను వివిధ రాజకీయ పార్టీలు, నేతలు ఖండించారు.అంబేడ్కర్ విగ్రహంపై దాడి మొత్తం దళిత సామాజిక వర్గంపై దాడిగా బీజేపీ అభివర్ణిస్తూ అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్రంగా మండిపడింది. ఈ ఘటన తీవ్రంగా కలచివేసిందని చెప్పిన బీజేపీ నేత సంబిత్ పాత్ర.. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం వహిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పంజాబ్లో చేతకాని తనంతో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేజ్రీవాల్ దళిత వ్యతిరేకని దుయ్యబట్టారు.పైకి మాత్రం దళితులంటే ప్రేమ అని చెప్పుకునే ఆమ్ ఆద్మీ ప్రభుత్వం, అదంతా బూటకమని ఈ ఘటనతో తేలిపోయిందని సంబిత్ పాత్ర అన్నారు.

ఇక పంజాబ్లో జరిగిన ఘటనపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ నేతృత్వంలో ఆ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించింది. ప్రజలకు క్షమాపణ చెప్పాలని వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాదు ఘటనలో పోలీసులు కూడా సైలెంట్గా ఉండటాన్ని బీజేపీ తప్పుబట్టింది. త్వరలో ఢిల్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తనపై తానే దాడి చేసుకుని సింపథీ సంపాదించేందుకు కూడా కేజ్రీవాల్ వెనుకాడరని బీజేపీ ఆరోపించింది.ఇక ఈ ఘటనపై ఇతర రాజకీయ పార్టీలు కూడా స్పందించాయి. పంజాబ్ కాంగ్రెస్ నేతలు ఎంపీ గుర్జీత్సింగ్ ఆజ్లా,సీనియర్ కాంగ్రెస్ నేత రాజ్కుమార్ వెర్కాలు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ దుశ్చర్యను ఖండించారు.ఘటనపై పూర్తిస్థాయిలో నిష్పక్షపాతమైన విచారణకు వారు డిమాండ్ చేశారు. నేరస్తులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని అన్నారు. న్యాయం ధర్మం వర్థిల్లాలంటే నేరస్తులకు కఠిన శిక్ష విధించాలని అన్నారు.
అంబేడ్కర్ విగ్రహ ధ్వంసం ఘటనతో పంజాబ్ ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. భారత రాజ్యాంగ రూపకర్త అయిన అంబేడ్కర్ విగ్రహాన్ని కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని, పంజాబ్లోని దళిత సమాజంపై ఆప్ ప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ, గౌరవం లేదని విపక్షాలు మండిపడ్డాయి. ఇక ఈ దుశ్చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన పలు దళిత సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. నేరస్తులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని అంబేడ్కర్ విగ్రహాలకు భద్రతను కల్పించాలని కోరాయి. ఇదిలా ఉంటే కేజ్రీవాల్కు ఖలిస్తానీ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్.
పంజాబ్లో అధికారంలోకి రావడం కోసం కేజ్రీవాల్ ఖలిస్తానీ మద్దతును కోరాడని గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా అజయ్ మాకెన్ గుర్తు చేశారు. అంబేడ్కర్ విగ్రహం ధ్వసం ఘటన ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని, దళితులకు ఆప్ ప్రభుత్వం అంటే ప్రేమలేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ మంట ఇప్పుడిప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. రోజు నిరసన కార్యక్రమాలతో పంజాబ్ హోరెత్తుతోంది. ఇకనైనా కఠినంగా వ్యవహరించి నేరస్తులను వెంటనే పట్టుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూసుకోవాలని దళిత సంఘాలు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications