oxygen:జగన్ సంచలనం, కేంద్రం నో -ప్రైవేటు ఆస్పత్రులకు మరో ఝలక్ -ఏపీలో ఫీవర్ సర్వే షురూ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా కొనసాగుతూ, రోజువారీ కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా, వైరస్ వ్యాప్తి కట్టడి, యాక్టివ్ కేసులకు మెరుగైన చికిత్స, ఆక్సిజన్ లభ్యతపై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ప్రతిరోజూ లక్షకు తగ్గకుండా శాంపిళ్లను పరీక్షిస్తున్నప్పటికీ వైరస్ వ్యాప్తిని అంచనావేయలేకపోతున్న పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వేను శుక్రవారం ప్రారంభించారు.
కొవిడ్ చికిత్సలకు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రులకు మరో ఝలక్ తప్పలేదు. పాకిస్తాన్ నుంచి ఆక్సిజన్ దిగుమతికి కేంద్రం ఇప్పటికే నో చెప్పగా, విదేశాల నుంచి ఆక్సిజన్ దిగుమతికి జగన్ విన్నవించడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..
అసైన్డ్ భూములపై జగన్ సంచలనం -వ్యవసాయ భూమికంటే 10శాతం ఎక్కువ పరిహారం -దేశంలో తొలిసారి ఏపీలోనే
ఏపీలో ఫీవర్ సర్వే ప్రారంభం..
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా శుక్రవారం నుంచి ఇంటింటా ఫీవర్ సర్వే ప్రారంభమైంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 వేల మంది ఆశా కార్యకర్తలు, 19 వేల మంది ఏఎన్ఎంలు నేటి(మే 7) నుంచి ఇంటింటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తించి, వారికి వెంటనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసి, అవసరమైన చికిత్స, సూచనలు, సలహాలు అందించాల్సి ఉంటుంది. సంబంధిత వివరాలను గ్రామ/వార్డు వలంటీర్ల ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు.
జ్వర లక్షణాలు ఉన్నవారికి టెస్ట్ చేసి, పాజిటివ్గా తేలితే.. వెంటనే 104 కాల్సెంటర్కు ఫోన్ చేసి తీవ్రతను బట్టి హోం ఐసొలేషన్ కిట్ ఇవ్వలా లేదా కోవిడ్ కేర్ సెంటర్కు పంపడం లేదా ఆస్పత్రికి పంపాలా అనేది నిర్ణయిస్తారు. మరోవైపు..
ప్రైవేటు ఆస్పత్రులపై పట్టు..
కరోనా విలయకాలంలో ఆరోగ్య రంగాన్ని పూర్తిగా జాతీయం చేయాలన్న డిమాండ్ సామాన్యుల నుంచి బలంగా వ్యక్తమవుతున్నది. మిగతా రాష్ట్రాలన్నీ ప్రైవేటుకు దాదాపుగా దాసోహమైపోగా, ఏపీ సర్కారు మాత్రం అందుకు భిన్నంగా ప్రైవేటు ఆస్పత్రులపై తనదైన పట్టును కొనసాగిస్తున్నది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన దరిమిలా ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్ ఆస్పత్రుల్లో విధిగా కోవిడ్ పేషెంట్లకు 50 శాతం బెడ్లు ఇవ్వాల్సిందేనని సీఎం జగన్ అన్నారు.
అంతకంటే ఎక్కువగా రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవడంతో పాటు బెడ్లు కేటాయించాలని ఆదేశించారు. తాత్కాలిక ఎంప్యానెల్ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు ఇవ్వాలని, కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్ ఎంప్యానెల్ ఆస్పత్రులూ బెడ్లు ఇవ్వాల్సిందేనని, అందుకోసం ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్ చేయాలని సూచించారు. అదే సమయంలో..
Recommended Video
విదేశాల నుంచి ఆక్సిజన్ దిగుమతి..
కొవిడ్ మరణాలకు తోడు వివిధ రాష్ట్రాల్లో ఆక్సిజన్ లేక చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. సరిపడా ఆక్సిజన్ సరఫరా చేయడంలో కేంద్ర సర్కారు విఫలం కావడంతో రాష్ట్రాలు సొంతగా ప్రయత్నాలు ఆరంభించాయి. పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకోవాలని పంజాబ్ సర్కారు ప్రయత్నించగా, అందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ నో చెప్పింది.
దీనిపై వివాదం కొనసాగుతుండనే ఇప్పుడు ఏపీ సర్కారు సైతం విదేశీ ఆక్సిజన్ అంశాన్ని లేవనెత్తింది. కొవిడ్ పరిస్థితులను సమీక్షించిన సీఎం జగన్.. ఆక్సిజన్ సరఫరా, నిల్వలో ఎక్కడా ఏ లోపం ఉండకూడదని, కేంద్రం ఇంకా ఎక్కువ ఆక్సిజన్ సరఫరా కోసం కృషి చేయడంతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. కాగా, ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇతర యంత్రాలను కేంద్రం తన వద్దే ఉంచుకోవడం, కేంద్ర సంస్థలకు తప్ప రాష్ట్రాలకు వాటిని పంపిణీ చేయకపోవడం వివాదాస్పదమైంది.