సీఎంగా 2వరోజే స్టాలిన్ సంచలనం -తమిళనాడులో పూర్తి లాక్డౌన్ -మే10 నుంచి రెండు వారాలపాటు
కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తుండటంతో దాన్ని నిలువరించే దిశగా పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రమైన మహారాష్ట్రలో లాక్డౌన్ తర్వాత కేసుల ఉధృతి తగ్గిన దరిమిలా మిగతా రాష్ట్రాలూ అదే బాటలో పయనిస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం సైతం ఆ రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించింది..
కరోనా విలయం నేపథ్యంలో రెండు వారాలపాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ నెల 10 నుంచి, అంటే సోమవారం ఉదయం నుంచి ఆరంభమయ్యే పూర్తి లాక్ డౌన్ ఈనెల 24 వరకు కొనసాగుతుందని తెలిపింది. మరోవైపు కర్ణాటకలో 10 నుంచి 24వ తేదీ వరకు లాక్డౌన్ విధించగా.. ఇక కేరళ ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 16 వరకు లాక్డౌన్ను ప్రకటించడం తెలిసిందే.
లాక్డౌన్ కు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో.. కిరాణ దుకాణాలను మధ్యాహ్నం 12 గంటల వరకు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చినా టేక్ అవేలకు మాత్రమే వాటిని పరిమితం చేసింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఏఎస్ఎంఏసీ) దుకాణాలను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
సచివాలయం, ఆరోగ్యం, రెవెన్యూ, విపత్తు నిర్వహణ, పోలీస్, అగ్నిమాపక, జైలు విభాగం, స్థానిక అధికార యంత్రాంగం, ఈబీ, పీడ్ల్యూడీ, సాంఘిక సంక్షేమం, అటవీ విభాగాలు మాత్రం పనిచేస్తాయని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్సులు, థియేటర్లు, జిమ్లు, రిక్రియేషన్ క్లబ్లు, బార్లు, ఆడిటోరియంలు, మీటింగ్ హాళ్లను మూసివేయాలని పేర్కొంది.
డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజే పూర్తి స్థాయి లాక్ డౌన్ విధింపు నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. శుక్రవారం సీఎంగా ప్రమాణం చేసిన ఆయన కొవిడ్ నేపథ్యంలో కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. కొవిడ్ సాయంగా తమిళనాడులో రేషన్ కార్డు కలిగిన 2.07కోట్ల కుటుంబాలకు రూ.4వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. తొలి విడత రూ.2వేలను లబ్దిదారుల ఖాతాల్లో జమచేశారు. కొవిడ్ రోగులకు ట్రీట్మెంట్ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందనీ సీఎం స్టాలిన్ చెప్పారు.
తొలి వేవ్ తోపాటు ప్రస్తుత సెకండ్ వేవ్ లోనూ కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న తమిళనాడులో నిన్న ఒక్కరోజే 26,465 కేసులు, 197 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు 13,23,965, మొత్తం మరణాలు 15,171కి చేరాయి.