టార్గెట్ చైనా: తక్షణమే మరో 20 వేల కోట్లు కావాలన్న రక్షణ శాఖ! ఓకే అన్న ఆర్థిక శాఖ
చైనాతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తమకు అదనంగా రూ.20 వేల కోట్లు కావాలంటూ రక్షణ శాఖ ప్రభుత్వాన్ని కోరింది.
న్యూఢిల్లీ: చైనాతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తమకు అదనంగా రూ.20 వేల కోట్లు కావాలంటూ రక్షణ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. మిలిటరీ ఆధునీకరణతోపాటు రోజువారీ నిర్వహణ ఖర్చులకు ఈ మొత్తం కావాలని ఆర్థికశాఖ అధికారులకు తెలిపింది.
చైనాతో ఏ సమయంలో యుద్ధం వచ్చినా అప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని రక్షణశాఖ భావిస్తోంది. ఇప్పటికే 2017-18 బడ్జెట్లో రక్షణ శాఖకు 2.74 లక్షల కోట్లు కేటాయించారు.
ఇందులో 50 శాతం కేపిటల్, ఆదాయంలో 41 శాతం ఇప్పటికే వాడేశామని ఆ శాఖ వెల్లడించింది. రక్షణశాఖ కార్యదర్శి సంజయ్ మిత్రాతోపాటు ఇతర అధికారులు ఆర్థికశాఖ అధికారులతో జరిపిన చర్చల్లో తమకు తక్షణమే మరో రూ.20 వేల కోట్లు కావాలని అడిగారు.

ఇందుకు ఆర్థికశాఖ కూడా సానుకూలంగా స్పందించింది. సాధ్యమైనంత త్వరగా రక్షణశాఖ అడిగిన మొత్తాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నంలో పడింది. ముఖ్యంగా పాకిస్థాన్, చైనాలతో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మిలిటరీ సంసిద్ధత ఇండియాకు అత్యవసరం.
మొత్తం రక్షణ శాఖ బడ్జెట్లో లక్షా 72 వేల 774 కోట్లు రోజువారీ నిర్వహణ, జీతాలకే సరిపోతుంది. మిగతా 86,488 కోట్లు కొత్త ఆయుధాలు, ఆధునీకరణ కోసం ఖర్చు పెట్టనున్నారు.
నిజానికి మన మిలిటరీని పూర్తిగా ఆధునీకరించడం కోసం వచ్చే ఐదేళ్లలో రూ.26.84 లక్షల కోట్లు అవసరమవుతాయని గతంలోనే రక్షణశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది.
ప్రస్తుతానికి మొత్తం జీడీపీలో రక్షణశాఖ కేటాయిస్తున్నది కేవలం 1.52 శాతం. ఇది క్రమంగా కనీసం రెండు శాతానికైనా పెరగాలని రక్షణ బలగాలు ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నాయి.
ఆర్మీకి ఆర్టిలరీ గన్స్, ఇన్ఫ్యాంట్రీ వెపన్స్, లైట్ హెలికాప్టర్స్, రాత్రిపూట యుద్ధం చేయడానికి సాయపడే పరికరాలు కొరతగా ఉన్నాయి. అటు ఎయిర్ఫోర్స్కి కూడా సరిపడా ఫైటర్స్, డ్రోన్స్, మిడ్ ఎయిర్ రీప్యూయలర్స్ లేవు.












Click it and Unblock the Notifications