నమ్మండి ప్లీజ్..రెండేళ్లలో మోడీ సర్కార్ 3,79,000 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందట
న్యూఢిల్లీ: అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు నోటికొచ్చిన హామీలు ఇస్తుంటాయి. అలవికాని భరోసాలను జనం మీద గుమ్మరిస్తుంటాయి. గంపగుత్తగా వచ్చి పడే వాగ్దానాల ప్రవాహంలో పడి జనం తమకు ఓట్లు గుద్దుతారనేది రాజకీయ పార్టీల విశ్వాసం. అధికారంలోకి వచ్చిన తరువాత.. వాగ్దానాలను ఏ స్థాయిలో అమలు చేస్తారనేది మనకు తెలిసిన విషయమే. 2014 నాటి ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్రమోడీ నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీ కూడా సాధ్యం కాని, అమలుకు నోచుకోని హామీలను ఇచ్చింది. ఇందులో ఒకటి.. ఏటా కోటి ఉద్యోగాలు. ఏటా కోటి ఉద్యోగాలనే మాట యువతను ఆకట్టుకుంది. నిరుద్యోగులతో ఓట్లను వేయించింది.
మోడీ అధికారాన్ని అందుకుని అయిదేళ్లు పూర్తి కావస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఏటా కోటి ఉద్యోగాలను ఇచ్చారా? అని ప్రశ్నిస్తే.. ఇచ్చామనే అంటోంది మోడీ సర్కార్. ఒకవైపు దేశంలో ఇప్పటికీ దేశంలో నిరుద్యోగ సమస్య వెంటాడుతుంటే.. దాన్ని వీలైనంత వరకు రూపుమాపామని చెబుతోంది ప్రభుత్వం. 2017-19 సంవత్సరాల మధ్య కాలంలో ఏకంగా 3,79,000 ఉద్యోగాలను కల్పించినట్లు వెల్లడించింది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ నెల 1న లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఈ విషయాన్ని పొందు పరిచింది.
ఇందులో 2,51,279 ఉద్యోగాలను కేంద్రప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో భర్తీ చేశామని పేర్కొంది. 2017-18 మధ్యకాలంలో రైల్వే, పోలీస్, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల శాఖల్లో ఆయా ఖాళీలను భర్తీ చేసినట్లు వెల్లడించింది కేంద్రం. ఈ ఏడాది మార్చి 1 నాటికి ఈ సంఖ్య 3,79,544 నుంచి 36,15,770 వకు చేరుకుంటుందని అంచానా వేసింది.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు.. నిరుద్యోగ సమస్యను లేవనెత్తారు. ఏటా కోటి ఉద్యోగాలను ఎన్డీఏ ప్రభుత్వం కల్పించలేకపోయిందంటూ లోక్ సభలో ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. ఉద్యోగాల కల్పనకు తీసుకుంటున్న చర్యలపై బడ్జెట్ ప్రతిపాదనల్లో కూలంకషంగా పొందుపరచలేదని విమర్శించారు. ఈ ఆరోపణలను తిప్పికొడుతూ.. కేంద్రం తాజాగా ఆయా వివరాలను కేంద్రం వెల్లడించింది.
ప్రావిడెంట్ ఫండ్, జాతీయ పింఛన్ విధానం, ఆదాయపు పన్ను ఫైలింగ్, పెరిగిన వాహనాల అమ్మకాలు.. వంటి విషయాలన్నీ, దేశంలో 3,79,000 మంది నిరుద్యోగులు కొత్తగా ఉద్యోగాలను పొందిన విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఎన్డీఏ ప్రభుత్వం వివరించింది. సాధారణ సంస్థలు, అసంఘటిత రంగాలు, రవాణా, హోటళ్లు, మౌలిక రంగం.. వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పించామని వెల్లడించింది. శాఖలు, రంగాల వారీగా ఈ రెండేళ్ల కాలంలో కల్పించిన ఉద్యోగాల సంఖ్యకు సంబంధించిన జాబితాను ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనల్లో సమర్పించింది.
రైల్వేలో 12,70,714 మంది ఉద్యోగులు ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి 98,999 కొత్త ఉద్యోగాలను కల్పిస్తారు. పోలీసు శాఖలో 10,52,351 మంది ఉద్యోగులు ఉండగా.. అదనంతగా 79,353 మందిని కొత్తగా తీసుకుంటారు. అలాగే- ప్రత్యక్ష పన్నుల విభాగంలో మార్చి 2017 నాటికి 53,394 మంది ఉండగా.. 2018 మార్చి నాటికి వారి సంఖ్య 92,842కు చేరిందని వివరించింది. పౌర విమానయాన శాఖలో 2017 మార్చి నాటికి 1174 మంది ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 2363కి చేరింది. తపాలా విభాగంలో 2017 మార్చి నాటికి 4,18,818 మంది ఉండగా 2019 మార్చి నాటికి ఈ సంఖ్య 4,21,068కి చేరుతుంది. విదేశాంగ మంత్రిత్వశాఖలో ఈ ఏడాది మార్చి నాటికి కొత్తగా 11,877 మంది ఉద్యోగులు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది కేంద్రం.