మోదీ అనూహ్యం: కేంద్ర కేబినెట్ విస్తరణ -ఎన్నికల రాష్ట్రాలకు ప్రాధాన్యం -అమిత్ షా, నడ్డాతో కసరత్తు, యూపీలోనూ
కిందటి నెలలో ఫలితాలు వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రదర్శన చేసింది. అస్సాంలో తిరిగి అధికారంలోకి రావడం, బెంగాల్ లో ప్రతిపక్ష హోదా సాధించడం, తమిళనాడులోనూ సీట్లు కైవసం చేసుకోవడం తెలిసిందే. అయితే ఇంకొద్ది రోజుల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలు మాత్రం వీటికి భిన్నం. ఎందుకంటే త్వరలో ఎన్నికలు జరగబోయే 5 రాష్ట్రాల్లో నాలుగు చోట్ల బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. కరోనా పరిస్థితుల నిర్వహణలో వైఫల్యం, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బీజేపీకి సవాలుగా మారాయి. ఈ దశలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయానికి సిద్దమయ్యారు. ఎన్నికల రాష్ట్రాల్లో ఎన్డీకు కలిసొచ్చేలా కేంద్ర కేబినెట్ విస్తరణకు కసరత్తు చేస్తున్నారు..
సజ్జల అనూహ్య కామెంట్స్: అమిత్ షాతో జగన్ భేటీ బ్రహ్మాండమా? -రఘురామ, 3రాజధానులు, సీబీఐ కేసులపైనా
మోదీ మహా బిజీ
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తన నివాసంలో తీరిక లేకుండా గడిపారు. కొవిడ్ పరిస్థితుల్లోనూ గడిచిన రెండు రోజులుగా మెజార్టీ సమయాన్ని పార్టీ కోసమే కేటాయించిన ఆయన కేంద్ర కేబినెట్ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నారు. బీజేపీలో నంబర్ 2, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతోపాటు వంతుల వారీగా మంత్రుల బృందాలతోనూ మోదీ సమావేశాలు జరిపారు. అమిత్ షా, జేపీ నడ్డాలు వేర్వేరుగా ఎన్డీఏ పార్టీలతో మంతనాలు జరిపారు. బీజేపీ బడా నేతలను నేరుగా కలిసినవారిలో యూపీకి చెందిన అప్నాదళ్ పార్టీ నేత అనుప్రియా పటేల్ కూడా ఉన్నారు. వరుస భేటీల్లో..
కేంద్ర కేబినెట్ విస్తరణ ఇలా
కేంద్ర మంత్రులు, పార్టీ చీఫ్ తో జరిగిన వరుస సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రధానంగా కేంద్ర కేబినెట్ విస్తరణపైనే చర్చించినట్లు తెలుస్తోంది. 2019లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దాదాపు రెండున్నరేళ్లు కావొస్తున్నా మోదీ ఇప్పటిదాకా కేబినెట్ ప్రక్షాళన జోలకి పోలేదు. ఈ గ్యాప్ లో ఎన్డీఏ నుంచి శివసేన లాంటి పార్టీలు దూరమైపోగా, వైసీపీ జగన్ లాంటి మిత్రులు మరింత దగ్గరయ్యారు. శివసేన మంత్రుల రాజీనామా, బెంగాల్ ఎన్నికల కోసం కేంద్ర మంత్రుల రాజీనామాలే కాకుండా కరోనా వల్ల పలువురు మంత్రులు చనిపోవడంతో చాలా శాఖల నిర్వహణను ఇంచార్జి మంత్రులతోనే నెట్టుకొస్తున్నారు. ఇప్పుడా కొరతను తీర్చుతూ కేంద్ర కేబినెట్ ను విస్తరించాలని మోదీ, బీజేపీ హైకమాండ్ భావిస్తున్నది. కేబినెట్ విస్తరణలో ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాలకు చెందిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
యూపీ కేబినెట్లోనూ మార్పుచేర్పులు
కేంద్ర కేబినెట్ విస్తరణతోపాటే ఉత్తరప్రదేశ్ లోనూ కేబినెట్ విస్తరణ చేపట్టాలని బీజేపీ హైకమాండ్ దాదాపు డిసైడైంది. ప్రధాని మోదీతో నేతల భేటీల్లో యూపీ వ్యవహారాలపైనా సుదీర్ఘ చర్చ జరిగిందని, సీఎం యోగి ఆదిత్యనాథ్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిన దరిమిలా పైన హైకమాండ్ ఉందని చాటుకునేలా యూపీ కేబినెట్ లో మార్పు చేర్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో రెండు రోజుల పాటు పర్యటించిన యూపీ సీఎం యోగితోనూ ఇదే అంశంపై నేతలు చర్చించారని సమాచారం. కేంద్రంలో అధికారంలోకి రావడానికి దగ్గరిదారి అయిన ఉత్తరప్రదేశ్ పై పట్టు కోల్పోతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతికూలంగా మారుతుందనే భయాల నడుమ బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. కాగా, కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఉత్తరప్రదేశ్ తోపాటు పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయి. పంజాబ్ తప్ప మిగతా నాలుగూ బీజేపీ పాలిత రాష్ట్రాలే.