కశ్మీర్ లో అదనపు కేంద్ర బలగాలు - జూన్ 15 లోగా పూర్తి : అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష..!!
అమర్నాథ్ యాత్రతో పాటు కశ్మీర్లో అదనంగా కేంద్ర బలగాలను మోహరించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. జమ్ముకశ్మీర్లో కొద్ది రోజులుగా హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కశ్మీర్లో పరిస్థితులు సహా అమర్నాథ్ యాత్ర భద్రతపై చర్చించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే హాజరయ్యారు.
వీరితో పాటుగా యూనియన్ హోం సెక్రెటరీ అజయ్ కుమార్ భల్లా, సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్, బీఎస్ఎఫ్ చీఫ్ పంకజ్ సింగ్, జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ సహా ఉన్నతాధికారులు అక్కడి పరిస్థితులను నివేదించారు. మే నెల నుంచి వరుసగా హత్యలు జరుగుతుండటంతో..అక్కడి శాంతిభద్రతలపై చర్చించారు.
మే 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 10 మందిని హత్య చేశారు ఉగ్రవాదులు. బ్యాంకు మేనేజర్ తొమ్మిదో వ్యక్తి. గురువారమే జరిగిన మరో ఘటనలో కార్మికులు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్లో దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు భద్రత కట్టుదిట్టం చేయాలని.. కేంద్ర బలగాలను మోహరించాలని అమిత్ షా ఆదేశించారు.
ఉగ్రదాడులను అరికట్టేందుకు జమ్ముకశ్మీర్లో పోలీస్ వ్యవస్థను పటిష్ఠపరచాలని నిర్దేశించారు. 350 అదనపు కంపెనీల బలగాలకు ఆమోదం లభించగా.. ఇప్పటికీ 150 కంపెనీలు కశ్మీర్ చేరుకున్నాయని, మరో 200 కంపెనీలు జూన్ 10-20 మధ్యలో చేరుకుంటాయని అధికారులు వివరించారు. ఈ నెల 15వ తేదీ లోగా బలగా మొహరింపు పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.