2025లోనే మమతా బెనర్జీ ఇంటికి అమిత్ షా
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి 42 సీట్లకుగాను 35 సీట్లు కట్టబెట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ఈ లక్ష్యాన్ని బీజేపీ సాధిస్తే 2025 తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీదీ సర్కారుకు 2026 మే వరకు గడువుంది. అయితే అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో పశ్చిమబెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి.
బెంగాల్ లోని బీర్బుమ్ జిల్లాలో అమిత్ షా పర్యటించారు. రాష్ట్రంలో పలుచోట్ల శ్రీరామ నవమి ర్యాలీల్లో ఘర్షణలు తలెత్తాయి. ఈ అంశాన్ని అమిత్ షా ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ హిట్లర్ తరహా పాలనను నడుపుతున్నారని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్లో 35 సీట్లకు పైగా సాధించి కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే శ్రీరామనవమి ర్యాలీలపై ఎవరూ దాడిచేసే సాహసం చేయరన్నారు.

ప్రస్తుతం ఎంపీగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ముఖ్యమంత్రిని చేయాలని దీదీ కలలు కంటున్నారని, కానీ బెంగాల్కు తర్వాత అయ్యే ముఖ్యమంత్రి బీజేపీ నుంచే అవుతారని వ్యాఖ్యానించారు. అవినీతి తృణమూల్పై పోరాడేది, ఓడించేది ఒక్క బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ 18 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. ఆయన వ్యాఖ్యలు అప్రజాస్వామికం, రాజ్యాంగవిరుద్ధమని నిప్పులు చెరిగింది.












Click it and Unblock the Notifications