వెంకయ్య నాయుడిపై రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు: పొరపాటుగా రాజకీయ నాయకుడయ్యారు
చెన్నై: ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడి రాజకీయ రంగ ప్రవేశంపై దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి, తప్పు చేశారని వ్యాఖ్యానించారు. వెంకయ్య నాయుడు,కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలోనే రజినీకాంత్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేగింది. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఓ పుస్తకాన్ని రూపొందించారు. దీని పేరు లిజనింగ్, లెర్నింగ్ అండ్ లీడింగ్. ఈ పుస్తకాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. ఆదివారం ఉదయం చెన్నైలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రజినీకాంత్ గౌరవ అతిథిగా హాజరయ్యారు.
పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం రజినీకాంత్ మాట్లాడారు. వెంకయ్య నాయుడు ఓ గొప్ప ఆధ్యాత్మిక వేత్త అని, ఆయన పొరపాటున రాజకీయ నాయకుడయ్యారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి కాకుండా.. ఆధ్యాత్మిక రంగం వైపు వెళ్లి ఉంటే ఓ గొప్ప మార్గదర్శకుడయ్యేవారని ప్రశంసించారు. అలాంటి ఆధ్యాత్మిక వేత్తను తాము పోగొట్టుకున్నామని రజినీకాంత్ చెప్పారు. ఆయన ఈ మాటలు చెబుతున్న సమయంలో వెంకయ్య నాయుడు, అమిత్ షా చిరునవ్వుతో కనిపించారు.
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దు అంశంపై రజినీకాంత్ స్పందించారు. ఈ చర్యను తాను స్వాగతిస్తున్నానని, సమర్థిస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా.. ఆధునిక కృష్ణార్జునులు అని చెప్పారు. వారిలో ఎవరు అర్జునుడో, ఎవరు కృష్ణుడో తనకు తెలియదని అన్నారు. ఈ విషయం వారే తేల్చుకోవాలని సూచించారు. దశాబ్దాలుగా చిక్కుముడి వీడని కాశ్మీర్ సమస్యకు మోడీ-అమిత్ షా చిటికెలో పరిష్కరించారని చెప్పారు. ఆర్టికల్ 370 బిల్లు సందర్భంగా ఉభయ సభల్లో అమిత్ షా చేసిన ప్రసంగం అద్భుతంగా ఉందని అన్నారు.