నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ - రాజకీయ తీర్మానంలో అమిత్ షా : 200 లోక్ సభ స్థానాలపై స్పెషల్ ఫోకస్..!!
తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా షా రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టారు. జాతీయ అంశాలతో పాటుగా.. తెలంగాణ అంశాన్ని తీర్మానంలో ప్రస్తావించారు. ఎంపీలు నియోజకవర్గాల్లోకి వెళ్లాలని ప్రధాన మంత్రి మోదీ సూచించారు. సమావేశాల అనంతరం మూడు రోజుల పాటు ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా 2 వందల పార్లమెంట్ నియోజకవర్గాలను గుర్తించారు. షా ప్రతిపాదించిన రాజకీయ తీర్మానానికి కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మ..అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మద్దతు పలికారు. తెలంగాణ నేతలు డీకే అరుణ.. ఈటల రాజేందర్ సైతం తీర్మానం పై చర్చలో మాట్లాడారు.

తెలంగాణ లో అధికారంలోకి వస్తున్నాం
తెలంగాణలోని పరిస్థితులను నేతలు ప్రస్తావించారు. అదే సమయంలో ప్రధాని మోదీ గిరిజన మహిళ ముర్ముకు రాష్ట్రతిగా ఎన్నుకుంటున్న అంశాన్ని ప్రత్యేకంగా వివరించారు. విపక్ష పార్టీల పైన షా తన తీర్మానంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కొవిడ్, సర్జికల్ స్ట్రైక్స్ సహా రాహుల్గాంధీని ఈడీ ప్రశ్నించినా... రాజకీయమే చేస్తోందన్నారు. కాంగ్రెస్ కనీసం అధ్యక్షుడిని ఎన్నుకోలేని స్థితిలో ఉందన్నారు. దీంతో..చర్చ తరువాత సమావేశం ఏకగ్రీవంగా రాజకీయ తీర్మానాన్ని ఆమోదించింది. బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లోనూ అధికారం దక్కించుకున్న విషయాన్ని అమిత్ షా ప్రస్తావించారు. రానున్న కాలంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, కేరళలో కూడా బిజేపీ రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు.

కాశ్మీర్ సమస్యపై కాంగ్రెస్ రాజకీయం
తమ పార్టీ రాజకీయాలను సేవ కోసం మాత్రమే వినియోగిస్తామంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయెజనాల కోసం కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని తీర్మానంలో పేర్కొన్నారు. గుజరాత్, హిమాచల్ప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరి జరిగే ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు. తెలంగాణపై అమిత్ షా, భాజపా అగ్ర నేతలు కీలక ప్రకటన చేయనున్నారు. కశ్మీర్ను అంతర్జాతీయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై అమిత్షా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని చెబుతూ.. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే పరిస్థితుల్లో లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్ర పతి ఎన్నికలో బిజేపీ గతంలో దళితునికి అవకాశం కల్పించింది.. ఇప్పుడు గిరిజన, ఆదివాసీ మహిళకు అవకాశం కల్పించిందని వివరించారు.

రాష్ట్రపతి ఎన్నికపై ప్రధాని
ఆ సమయంలో జోక్యం చేసుకున్న ప్రధాని ఒక గిరిజన మహిళ తొలి సారి రాష్ట్రపతి కాబోతున్నారని.. గిరిజనులకు అత్యున్నత స్థానం కల్పించాలనే ముర్మును అభ్యర్ధిగా ఎంపిక చేసామని పేర్కొన్నారు. ఇక, తీర్మానంలో భాగంగా.. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా లో బిజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మరోసారి స్పష్టం చేసారు. తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రత్యేకంగా అమిత్ షా వివరించారు. వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లిందని వివరిస్తూ..ప్రస్తుతం ప్రజలంతా... అభివృద్ధి - ప్రగతి కావాలని కోరుకుంటున్నారని..ఆ దిశగానే బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు. ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నో మైలు రాళ్లు చేరుకున్నామని..ఇంకా చేయాల్సినవి ఉన్నాయని అమిత్ షా తీర్మానంలో పేర్కొన్నారు. సమావేశంలో దీని పైన చర్చించిన తరువాత ఏకగ్రీవంగా ఆమోదించారు.












Click it and Unblock the Notifications