మహిళ పట్ల అసభ్యంగా: ఎంఎల్ఏ పై కేసు
పాట్నా: అధికారంలో ఉన్న శాసన సభ్యులు ఏమి చేసినా చెల్లుతుందని అనుకుంటున్నారు. పక్కన భర్త ఉన్నా సరే మద్యం మత్తులో ఉన్న ఆ ప్రజా ప్రతినిధి మహిళను వేదింపులకు గురి చేసి తన వంకర బుద్ది చూపించాడు.
బీహార్ లో అధికారంలో ఉన్న జేడీ(యూ) శాసన సభ్యుడు సర్పరాజ్ ఆలం మీద కేసు నమోదు అయ్యింది. ఆదివారం కటిహార్ లో సర్పరాజ్ గువహటి రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కారు. అదే రైలులో దంపతులు ప్రయాణిస్తున్నారు.
రైలు వేగంగా వెళుతున్న సమయంలో శాసన సభ్యుడు సర్పరాజ్ ఆలం మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆ సమయంలో ఆమె భర్త పక్కనే ఉన్నారు. సాటి ప్రయాణికులు శాసన సభ్యుడికి ఎంత నచ్చ చెప్పినా ఆయన పట్టించుకోలేదు.
రైలు పాట్నా చేరుకున్న తరువాత బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాసన సభ్యుడు సర్పరాజ్ ఆలం పీకలదాక మద్యం సేవించి ఉన్నాడని బాధితురాలి భర్త ఇంద్రపాల్ సింగ్ బేడీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు సర్పరాజ్ ఆలం మీద కేసు నమోదు చేశారు. పరారైన ఆయన కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బీహార్ లో ప్రజా ప్రతినిధులు ప్రజల పట్ల ఇలా వ్యవహరించడం మామూలుగా జరుగుతున్నా పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.