ఊహాగానాలకు తెర దించిన సుమలత..!!
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరుకుంది. అన్ని పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల్లో హోరెత్తిస్తోన్నాయి. దీనితోపాటు ఫిరాయింపులు కూడా మొదలయ్యాయి. ఇండిపెండెంట్ ఎంపీ సుమలత కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరకుంది. ఈ నెలాఖరులోగా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నందున ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచార కార్యక్రమాలకు మరింత పదును పెడుతున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. ఇప్పటికే జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టాయి. ఆయా పార్టీల సీనియర్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు.

బీజేపీకి బూస్ట్..
తాజాగా- మండ్యకు చెందిన ఇండిపెండెంట్ లోక్ సభ సభ్యురాలు సుమలత.. కీలక నిర్ణయం తీసుకున్నారు. నరేంద్ర మోదీకి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. కొద్దిసేపటి కిందటే ఆమె మండ్య చాముండేశ్వరి నగరలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని, ఓ సగటు భారతీయుడు తల ఎత్తుకునేలా మోదీ పరిపాలన సాగిస్తోన్నారని అన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో..
2019 నాటి లోక్ సభ ఎన్నికల్లో తనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం తాను స్వతంత్ర ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ- మండ్య నియోజకవర్గం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసిందని అన్నారు. స్వచ్ఛమైన రాజకీయాలను బీజేపీ మాత్రమే చేయగలుగుతుందని, దేశాభివృద్ధిని కాంక్షించేది అదొక్క పార్టీయేనని తేల్చి చెప్పారు. అందుకే తాను మోదీ నేతృత్వంలోని బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని చెప్పారు.

బీజేపీలో చేరికపై..
బీజేపీలో చేరబోతోన్నారంటూ వస్తోన్న వార్తలపైనా సుమలత స్పందించారు. ప్రస్తుతం తాను బీజేపీలో చేరట్లేదని, దానికి ఇంకా సమయం ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరితే.. తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు రావొచ్చని అన్నారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం తనకు లేదని, దీనివల్ల ప్రజాధనం వృధా అవుతుందని చెప్పారు. అందుకే- సరైన సమయంలో బీజేపీలో చేరుతానని స్పష్టం చేశారు.

అనుచరులకు టికెట్లు..
తన కుమారుడు, కన్నడ నటుడు అభిషేక్ అంబరీష్.. ఇప్పట్లో రాజకీయాల్లోకి రాడనీ సుమలత తేల్చిచెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు ఇప్పించే ఉద్దేశంతో సుమలత ఉన్నారని తెలుస్తోంది. మండ్య, మద్దూరు, శ్రీరంగపట్టణ.. వంటి కీలక నియోజకవర్గాల్లో తన ఆప్తులకు టికెట్లను కేటాయించాలంటూ గురువారమే ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. మండ్య లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలన్నింట్లోనూ తన అనుచరులకు టికెట్లు ఇవ్వాలని కోరారు.












Click it and Unblock the Notifications