బిగ్గెస్ట్ డ్రగ్ రాకెట్తో కాంగ్రెస్కు లింక్
Drugs rocket: దేశ రాజధానిలో ఇటీవలే నార్కొటిక్స్ అధికారుల చేతికి చిక్కిన బిగ్గెస్ట్ డ్రగ్ రాకెట్ వ్యవహారం రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దీని విలువ 5,600 కోట్ల రూపాయలు కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మాజీ నాయకుడితో సంబంధాలు ఉన్నాయంటూ భారతీయ జనతా పార్టీ బాంబు పేల్చింది.
ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చుతున్నప్పటికీ- దుమారం మాత్రం చల్లారట్లేదు. ఈ డ్రగ్ రాకెట్కు కాంగ్రెస్ పార్టీ నాయకులే సమాధానం చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీని వెనుక ఉన్న వాళ్లెవరో దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది.

ఇటీవలే ఢిల్లీ దక్షిణ ప్రాంతంలో నార్కొటిక్స్ అధికారులు 560 కేజీల కొకైన్, 40 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పటివరకు వెలుగులోకి రాని అంతర్జాతీయ డ్రగ్ ముఠా గుట్టును రట్టు చేసినట్టయింది. నార్కొటిక్స్ అధికారులు అరెస్ట్ చేసిన వారిలో తుషార్ గోయెల్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్నారు.
2022లో తుషార్ గోయెల్.. ఢిల్లీ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆర్టీఐ సెల్ చైర్మన్గా లో పని చేయడం రాజకీయ వివాదానికి కేంద్రబిందువు అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వంటి బీజేపీ నాయకులు.. ఈ డ్రగ్ రాకెట్లో కాంగ్రెస్ పాత్రను బహిరంగంగా ప్రశ్నిస్తోన్నారు.
యువతను కాంగ్రెస్ పార్టీ డ్రగ్స్ వైపు మళ్లించిందని, ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన నిధులను ఇలా అక్రమంగా సంపాదించుకుంటోందంటూ ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హుడా, ఆయన పొలిటికల్ నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకుని ఈ ఆరోపణలు గుప్పించారు మోదీ.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి అవసరమైన నిధులను ఈ డ్రగ్ నెట్వర్క్ ద్వారా సమకూర్చుకున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో తుషార్ గోయెల్ పాత్ర ఏమిటనేది స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ టాప్ క్యాడర్ నాయకులతో తుషార్ కలిసి దిగిన ఫొటోలు ఈ ఆరోపణలకు మరింత బలాన్ని ఇచ్చినట్టయింది.
డ్రగ్స్ విక్రయం ద్వారా వచ్చిన డబ్బును హర్యానా ఎన్నికల్లో ఉపయోగించారా? అంటూ బీజేపీ సంధించిన ప్రశ్నలను తిప్పి కొట్టడం మినహా కాంగ్రెస్ వద్ద ఎలాంటి సమాధానం లేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఆరోపణలే రుజువైతే- వ్యవస్థీకృత నేర వ్యవస్థ అనేది రాజకీయాలతో ఎంతగా పెనువేసుకుపోయిందనే విషయాన్ని ప్రస్ఫూటం చేసినట్టవుతుంది.
ఈ ఆరోపణలను కాంగ్రెస్ తిప్పి కొట్టింది. తుషార్ గోయెల్తో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. తన రాజకీయ ప్రయోజనాల కోసమే తుషార్ గోయెల్ అంశాన్ని అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రస్తావించిందని, అదంతా దుష్ప్రచారమని తోసిపుచ్చింది.
ఈ అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్లో గోయెల్ ప్రమేయం ఎంతవరకు ఉందనే విషయంపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తోంది. గోయెల్కు మిడిల్ ఈస్ట్ దేశాలతో కీలకమైన సంబంధాలు ఉన్నాయని, భారత్ అంతటా డ్రగ్స్ పంపిణీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు భావిస్తోన్నారు.
కాంగ్రెస్ పాలనలో పంజాబ్తో పాటు హర్యానా వంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ నెట్ వర్క్ దేశం అంతటా విస్తరించిందంటూ స్వయానా అమిత్ షా ఆరోపణలు చేయడం రాజకీయ కలకలానికి కారణమైంది. ఈ డ్రగ్స్ రాకెట్లో గోయెల్ పాత్ర ఏమిటనేది వెలుగులోకి వస్తే మాత్రం కాంగ్రెస్ రాజకీయంగా ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కొనడం తప్పకపోవచ్చు.












Click it and Unblock the Notifications