ఉప ఎన్నిక వేళ.. అధికార పార్టీకి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల కమిషన్
ముంబై: దేశంలో ఉప ఎన్నికల కోలాహలం నెలకొంది. తెలంగాణ నల్లగొండ జిల్లా మునుగోడు సహా.. పలు నియోజకవర్గాలు ఉప ఎన్నికలను ఎదుర్కొంటోన్నాయి. నవంబర్ 3వ తేదీన పోలింగ్ను షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. 6వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.మునుగోడుతో పాటు అంధేరి ఈస్ట్-మహారాష్ట్ర, మొక్మా, గోపాల్ గంజ్-బిహార్, ఆదంపూర్-హర్యానా, గోలా గోక్రనాథ్- ఉత్తర ప్రదేశ్, ధామ్నగర్-ఒడిశా అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నికను నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ అయింది.
అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికలకు సమాయాత్తమౌతోన్న వేళ.. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన-భారతీయ జనత పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు షాకిచ్చారు. ఎన్నికల గుర్తు బాణం-విల్లును స్తంభింపజేశారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆదేశాలను జారీ చేశారు. అటు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గం గానీ, ఇటు- మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వర్గం గానీ ఈ గుర్తును వినియోగించకూడదని స్పష్టం చేశారు.
ఎన్నికల గుర్తు విషయంలో ఉద్ధవ్ థాకరే-ఏక్నాథ్ షిండే మధ్య వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అగాఢీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసి, బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. తమను అసలైన శివసేనగా గుర్తించాలంటూ డిమాండ్ చేస్తోన్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్ధవ్ థాకరే పోరాడుతోన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ దశలో ఉంది.
ఈ పరిస్థితుల మధ్య అంధేరి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడంతో- శివసేన ఎన్నికల గుర్తును స్తంభింపజేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అంధేరి ఈస్ట్ నియోజకవర్గం శివసేన ఆధీనంలో ఉంది. శివసేన సిట్టింగ్ రమేష్ లట్కే ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. శివసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో కొత్తగా ఏర్పాటైంది. 2014, 2019 ఎన్నికల్లో శివసేన గెలిచిందిక్కడ.
అధికార మార్పిడి చోటు చేసుకున్నతరువాత ఎదుర్కొంటోన్న తొలి ఎన్నిక ఇదే కావడం వల్ల ఉద్ధవ్ థాకరే, ఏక్నాథ్ షిండే వర్గం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఒకే గుర్తుపై ఇద్దరు అభ్యర్థులు పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో ఈ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంది. గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేసింది. శివసేన గుర్తును ఎవరికి కేటాయించాల్సి ఉంటుందనే విషయంపై స్పష్టత ఇవ్వాలంటూ ఈ రెండు వర్గాలకు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు గడువు ఇచ్చింది.