నీటి సంప్ లో ఆంధ్ర బాలిక శవం: అత్యాచారమని అనుమానం
బెంగళూరు: పాఠశాలకు వెళ్లిన బాలిక అనుమానాస్పద స్థితిలో నీటి సంప్లో శవమై కనిపించిన సంఘటన బెంగళూరు నగరంలోని వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. సుసన్నా అలియాస్ సుశీల (9) అనే బాలిక అనుమానాస్పదస్థితిలో మరణించింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన శామ్యూల్, నరసమ్మ దంపతులు బెంగళూరు చేరుకుని వైట్ ఫీల్డ్ సమీపంలోని పెట్టందూరులో నివాసం ఉంటున్నారు
వీరి కుమార్తె సుసన్నా. శామ్యూల్ కూలి పని చేస్తున్నాడు. నరసమ్మ ఇంటి పని చేస్తున్నది. సుసన్నా అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నది. సోమవారం ఉదయం సుసన్నా స్కూల్ కు వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు.
రాత్రి 10 గంటల వరకు సుసన్నా కోసం గాలించిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం పాఠశాలలోని అన్ని గదలలో పరిశీలించారు. పాఠశాల ఆవరణంలోని ఒక గదిలో నీటి సంప్ ఉంది. అనుమానం వచ్చి నీటి సంప్ లో చూడగా సుసన్నా శవమై కనిపించింది.
స్కూల్ ఆవరణంలో పిల్లలు ప్రమాదవశాత్తు నీటి సంప్ లో పడిపోకుండా దాని మీద ఇనుప డోర్ ఏర్పాటు చేశారు. అందువల్ల సుసన్నాప్రమాదవశాత్తు నీటి సంప్ లో పడే అవకాశం లేదని విద్యాశాఖ అధికారి రమేష్ అన్నారు.
తన కుమార్తెను హత్య చేసి నీటి సంప్ లో వేసి డోర్ మూసి వేశారని సుసన్నా తండ్రి శామ్యూల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీటి సంప్ ఉన్న గదికి ఎప్పుడూ తాళం వేసి ఉంచుతారని పోలీసులు అన్నారు. అంతే కాకుండా నీటి సంప్ మీద ఇనుప డోర్ మూసి ఉందని చెప్పారు.
ఇన్ని జాగ్రతలు తీసుకున్నా సుసన్నా అందులో ఎలా పడిందనే వివరాలు సేకరిస్తున్నామని బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ హరిశేఖరన్ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించామని, వైద్య నివేదికలో అన్ని విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు తెలిపారు. బాలిక మీద అత్యాచారం చేసిన నిందితులు భయపడి నీటి సంప్ లో తోసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.