ఎర్రచందనం: బెంగాల్లో ఏపీ టాస్క్ఫోర్స్ సోదాలు, మయన్మార్ వ్యక్తి అరెస్ట్
కోల్కతా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎర్ర చందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి ప్రాంతంలో సోమవారం నాడు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో టాస్క్ ఫోర్స్ పదకొండు టన్నుల ఎర్ర చందనంను సీజ్ చేశారు.
సమాచారం మేరకు.. టాస్క్ ఫోర్స్ సీజ్ చేసిన ఎర్రచందనం విలువ పది కోట్ల నుండి ఇరవై కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ సోదాల్లో పోలీసులు సౌందర రాజన్ అనే ఎర్ర చందనం స్మగ్లర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
సౌందర రాజన్ సహా ఇతరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనిని ట్రాన్సిట్ రిమాండు పైన పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకు రానున్నారు. కాగా, ఈ సౌందర రాజన్ మయన్మార్ జాతీయుడని సమాచారం. ఇతను తన ఎర్ర చందనం గోడౌన్ను సిలిగిరిలో ఏర్పాటు చేశాడని తెలుస్తోంది.
ఎర్రచందనం దొంగలు ఎర్ర చందనం కర్రలను చైనాకు తరలిస్తున్నారని తెలుస్తోంది. నేపాల్, బర్మా మీదుగా వారు చైనాకు తరలిస్తున్నారు. చైనాలో ఎర్ర చందనంకు చాలా డిమాండ్ ఉంది. చైనాలో ఒక టన్ను ఎర్ర చందనం రూ.10 కోట్ల వరకు పలుకుతుంది. అదే భారత్లో దాని విలువ రూ.15 లక్షల నుండి 20 లక్షల వరకు పలుకుతుంది.