రాజకీయ నాయకులు ఇడియట్స్: భారతరత్న సిఎన్ఆర్

CNR Rao
బెంగళూరు: భారతరత్న అవార్డుగ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త సిఎన్ఆర్ రావు ఆదివారం రాజకీయ నాయకుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సైన్స్‌కు తక్కువ నిధులు ఇస్తున్న రాజకీయ నాయకులు ఇడియట్స్ అని మండిపడ్డారు. శాస్త్ర పరిశోధనలకు నిధుల కేటాయింపులో రాజకీయ నేతలంతా విఫలం అవుతున్నారన్నారు. కేంద్రం తనను దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నకు ఎంపిక చేసినట్టు ప్రకటించిన ఒకరోజు తర్వాత రావు ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ శాస్త్ర పరిశోధనలకు మరింతగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వం శాస్త్ర పరిశోధనా రంగానికి ఇచ్చే సొమ్ముకు మించి మేము ఎంతో సాధించామన్నారు. దేశంలో శాస్త్ర పరిశోధనా రంగం స్థితి బాగా లేదని మీరు భావిస్తున్నారా? అని ఒక విలేఖరి అడగ్గా, 'ఈ ఇడియట్స్ (రాజకీయ నేతలు) మాకు తక్కువ నిధులు ఎందుకు ఇస్తున్నారు? ఆ నిధులు కూడా ఆలస్యంగా వస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం మాకు ఇస్తున్న నిధులకన్నా మేము ఎక్కువే సాధించాం' అని రావు మండిపడ్డారు.

ఈ రంగంలో చైనా సాధించిన పురోగతి గురించి ప్రశ్నించగా.. తప్పు మనలోనే ఉందని, భారతీయులు చైనా వాళ్లలాగా ఎక్కువ కష్టపడాలని అనుకోరని, వాళ్లంత దేశాభిమానులం కాదని, అంతేకాదు కాస్తంత ఎక్కువ డబ్బులు వస్తాయంటే మనం విదేశాలకు వెళ్లడానికి సిద్ధమవుతామని అన్నారు. విద్య, శాస్త్ర రంగాల్లో ఎలా పెట్టుబడులు పెడతారనే దాని పైనే భారత దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని రావు అంటూ, ఈ రంగాలకు ప్రభుత్వ మద్దతు ఉండాల్సినంత స్థాయిలో లేదని విచారం వ్యక్తం చేశారు.

భారత దేశ భవిష్యత్తు సైన్స్‌పై ఆధారపడి ఉందని, ప్రపంచంలో శాస్ర్తియంగా పురోగతి సాధించిన దేశాలు మాత్రమే అభివృద్ధిలో ముందంజ వేశాయన్నారు. అందుకనే విద్య, శాస్త్ర రంగాల్లో మరింతగా పెట్టుబడి పెట్టాలన్నారు. దేశ సెన్సెక్స్, వ్యాపార రంగం బాగుంటే చాలదని, అది అయిదు, పదేళ్లు మాత్రమే ఉంటుందని, దీర్ఘకాలిక ప్రగతి మాటేమిటి? అది జరగాలంటే సైన్స్‌లో పురోగతి సాధించాలన్నారు.

పురోగతి సాధించడానికి సైన్స్ ఒక్కటే మార్గమని, మన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ విషయాన్ని నమ్మేవారని అయితే, దురదృష్టవశాత్తు ఈ రంగానికి మద్దతు ఉండాల్సినంత స్థాయిలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్య, వౌలిక శాస్తర్రంగాల్లో మనం తగినంతగా పెట్టుబడులు పెట్టడం లేదని అంటూ, ఈ రంగాలకు స్థూల జాతీయ ఉత్పత్తి (జిడిపి)లో కనీసం ఆరుశాతం ఉండాలన్నారు. అయితే మనం ఇప్పుడు రెండు శాతమే ఖర్చు చేస్తున్నామని రావు వెల్లడించారు.

"విద్యారంగంలోనూ, సైన్స్ రంగంలోనూ మనం మరిన్ని పెట్టుబడులు పెట్టాలి. సెన్సెక్స్, వ్యాపారం బాగున్నంతమాత్రన దేశం బాగున్నట్టు కాదు. ఈ ప్రభావం ఐదు-పదేళ్లపాటు మాత్రమే ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో పరిస్థితి ఏమిటి? సైన్స్‌లో ప్రగతితోనే భవిష్యత్ భద్రత సాధ్యం'' అని రావు స్పష్టం చేశారు.

ఐటీపై గుర్రు

రాజకీయ నాయకులపైనే కాదు.. ఐటీ రంగంపైనా సిఎన్ఆర్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఐటి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) అనేది అసలు సైన్సే కాదని.. అది కొందరు డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతోందని అన్నారు. అంతేకాదు ఐటి రంగంలో చాలామంది అసంతృప్తితో పనిచేస్తున్నారంటూ ఇటీవలి కాలంలో పేపర్లలో వస్తున్న ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యల గురించి ప్రస్తావించారు. ఐటి ఉద్యోగులను అసంతృప్త గుంపుగా అభివర్ణించారు.

ఎనభై ఏళ్ల వయసులోనూ నేను ఎంత ఆనందంగా ఉన్నానో చూడండని అన్నారు. ఐటి ఉద్యోగులు తమ పనిలో ఆనందం పొందుతారని తాను అనుకోవట్లేదన్నారు. విజ్ఞాన శాస్త్రంలో తాజా ఆవిష్కరణలను వినియోగించుకుని భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని, మరిన్ని ఆవిష్కరణలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. సరికొత్త ఆవిష్కరణల విషయంలో ఇండియా 140 దేశాల్లో 66వ స్థానంలో ఉందని, ఆ స్థానం నుంచి టాప్-10లోకి రావాల్సి ఉందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+