మూడురోజుల్లో రెండు పులులు హతం: ట్రాక్టర్తో తొక్కించి మరో పులిని చంపేసిన గ్రామస్తులు
13 మందిని చంపిన అవిని అనే పులిని హతమార్చిన మూడురోజులకే మరో పులిని చంపేశారు ఉత్తర్ప్రదేశ్లోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు. వివరాల్లోకెళితే ఉత్తర్ప్రదేశ్లోని పిలిబిట్ జిల్లాలో ఓ పెద్దపులి 50 ఏళ్ల వ్యక్తిని ఈడ్చుకెళ్లి చంపేయడంతో దాన్ని గ్రామస్తులు ట్రాక్టర్తో తొక్కించి చంపేశారు . ఈ ఘటన కృష్ణపూర్ అభయారణ్యంలోని పులుల సంరక్షణ కేంద్రంలో చోటుచేసుకుంది. రెండురోజుల వ్యవధిలోనే రెండు పులులను చంపి వేయడంతో జంతుప్రేమికులు మండిపడుతున్నారు. పులుల సంరక్షణ కేంద్రాల్లోకి వెళ్లి మరీ మనుషులు ఈ పులులను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పులిపై ప్రతీకారం తీర్చుకున్న గ్రామస్తులు
ఓ మనిషిని చంపినందుకే ప్రతీకారంగా పులిపై దాడిచేసి గ్రామస్తులు చంపారని దుద్వా పులి సంరక్షణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ మహవీర్ కౌజ్లగి తెలిపారు. పులి దేవానంద్ అనే గ్రామస్తుడి పై దాడి చేశాక అతన్ని హాస్పిటల్కు తరలించామని చెప్పారు. అదే సమయంలో కోపోద్రిక్తులైన గ్రామస్తులు ఆ పులిని ట్రాక్టర్తో తొక్కించి చంపేశారని చెప్పారు. దేవానంద్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డిప్యూటీ డైరెక్టర్ మహవీర్ తెలిపారు. ఇదిలా ఉంటే పులిని చంపిన వారిపై చర్యలు తీసుకుంటామని ఫీల్డ్ డైరెక్టర్ రమేష్ కుమార్ పాండే తెలిపారు. పులి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పిన మహవీర్ నేషన్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ గైడ్లైన్స్ ప్రకారం పోస్టుమార్టం నిర్వహిస్తామని తెలిపారు.
అడవుల్లో సరిపడా ఆహారం లేకపోవడంతోనే జనావాసాల్లోకి పులులు
పెద్ద పులి భారతదేశ జాతీయ జంతువు. అంతేకాదు వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఇది అంతరించి పోతున్న జంతువుల జాబితాలో ఉంది. అయితే ఈ పులులు మనుషులపై దాడి చేసి చంపుతున్నందున అదే స్థాయిలో ప్రజలు వాటిపైన దాడి చేసి చంపేస్తున్నారు. ఇదిలానే కొనసాగితే ఇక పులులు భారతదేశంలో కనిపించవని అంతర్జాతీయ జంతుప్రేమికులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "అటవీప్రాంతాల్లో పులులకు సరిపడా ఆహారం దొరక్క పోవడంతో అవి కడుపునింపుకునేందుకు అడవులకు దగ్గరలోని గ్రామాల్లోకి వస్తున్నాయి. కనపడిన వారిపై దాడి చేసి చంపేసి తమ కడుపులను నింపుకుంటున్నాయి. పులులను గ్రామాల్లో చూస్తే గ్రామస్తులు వారి ప్రాణాలు కాపాడుకునే క్రమంలో వాటిపై దాడి చేసి చంపేస్తున్నారు. " అని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫ్రెడరేషన్ తెలిపింది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా పులులు 3,900 మాత్రమే ఉన్నాయని వాటిని సంరక్షించుకునే బాధ్యత తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రపంచంతో పోలిస్తే భారత్లోనే ఉన్న సగం పులులు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల సంఖ్యలో సగానికి పైగా భారతదేశంలోని అటవీ ప్రాంతాల్లోనే ఉన్నట్లు 2014 గణాంకాలు తెలుపుతున్నాయి. భారత దేశంలో 2,226 పులులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతి ఏటా డజనుకు పైగా పులులు మృతి చెందుతున్నాయి. ఇందులో కొన్ని పులులను మానవుడు వేటాడుతుండగా మరికొన్ని పులులు అనారోగ్యంతో మృతి చెందుతున్నాయి. అక్టోబర్ 2016లో ఉత్తర భారతంలో ఓ పులిని చంపేశారు అటవీశాఖ సిబ్బంది. అది సమీప గ్రామంలోకి చొరబడి ముగ్గురు గ్రామస్తుల ప్రాణాలను తీసిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ గ్రామస్తులు పులి మృతదేహంతో ఊర్లో ఊరేగించి సంబరాలు చేసుకున్నారు.