స్వచ్ఛ భారత్: నాగ్, సానియాకు అంబానీ ఆహ్వానం
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ముంబైలో చీపురు పట్టి రోడ్లు వూడ్చారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు అనిల్ అంబానీ స్వచ్చ భారత్ కార్యక్రమ ప్రాచారంలో పాల్గొన్నారు.
అనంతరం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, ఆసియా గేమ్స్ బంగారు పతక విజేత మేరీకోమ్, సానియా మిర్జాలతో పాటు టాలీవుడ్ మన్మదుడు నాగార్జున, ప్రముఖ కాలమిస్ట్ శోభా డే, జర్నలిస్ట్ శేఖర్ గుప్తా, రచయిత ప్రసూన్ జోషి, రన్నర్ క్లబ్ ఆఫ్ ఇండియాలను స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొని మరింత ముందుకు తీసుకెళ్లాలని అనిల్ అంబానీ వారిని ఆహ్వానించారు.
మంగళవారం రాత్రి ముంబైలోని చర్చిగేటు సమీపంలో తన బృందంతో కలిసి రోడ్లు శుభ్రం చేశారు. చర్చిగేటు వద్ద రోడ్డును శుభ్రం చేయడానికి అనిల్ అంబానీ, అతడి స్నేహితుల కృషి అద్బుతమని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ను ప్రధాని మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. వచ్చే ఐదేళ్లలో భారత దేశాన్ని క్లీన్ ఇండియాగా మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సినీ నటులను, ప్రముఖులను ఆహ్వానించారు. మోడీ ఆహ్వానించినవారిలో 9 మందిలో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, ప్రియాంక చోప్రా, శశిథరూర్, సచిన్ టెండూల్కర్, తారక్ మెహతా, అనిల్ అంబానీ, మృదుల సిన్హా, బాబా రాందేవ్ తదితరులు ఉన్నారు.
అంతక ముందు స్వచ్ఛ్ భారత్లో భాగస్వామిగా మారిన రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ తనకు తానుగా ఈ ఉద్యమానికి అంకితమవుతున్నట్టు ప్రకటించారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్లో భాగస్వామి కావాలని ప్రధాని తనని కోరడం అత్యంత గౌరవంగా భావిస్తున్నట్టు అనిల్ పేర్కొన్నారు.